AP-Telangana : తెలంగాణలో కలపాల్సిందేనంటున్న ఆ ‘ఐదు గ్రామాలు’..వారి సమస్యలేంటి..?డిమాండ్లు ఏంటి ?

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి అనే డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఏమంటున్నారు..? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి..?

AP-Telangana : తెలంగాణలో కలపాల్సిందేనంటున్న ఆ ‘ఐదు గ్రామాలు’..వారి సమస్యలేంటి..?డిమాండ్లు ఏంటి ?

Dispute Of Five Villages Between Telugu States (1)

five villages disputes between ap-telangana : మహాభారతంలో పంచపాండవులకు ఐదూళ్లిచ్చినా చాలంటూ శ్రీకృష్ణుడు రాయబారం నడుపుతాడు కౌరవులతో. యుద్ధాన్ని నివారించి, ఇరు పక్షాల నడుమ సయోధ్య కుదర్చడానికి గానూ ఆయన చేసిన ప్రయత్నం నాడు విఫలమైంది. ఫలితంగా మహాభారత యుద్ధం జరిగింది. అది పురాణకాలం. యుగాలు మారినా.. కాలాలు మారినా.. రాజకీయాలు మారినా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా అదే ‘ఐదు ఊళ్ల’ రగడ రగులుతోంది. భద్రాచలం వరద ముంపుతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలి అని అప్పుడెప్పుడో ఉద్యమం సమయంలో వినిపించిన మాట.. మళ్లీ ఇప్పుడు ఎందుకు రీసౌండ్‌ ఇస్తోంది. అసలు ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఏమంటున్నారు.. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి.. తెలంగాణలో కలిపి తీరాల్సిందేనని పట్టిన పట్టు వారు ఎందుకు వీడడం లేదు..? రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా.. 2008లోనే ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి… ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ భూములకు.. ఇంటి నిర్మాణం కోసం కేటాయించారు. ఐతే ప్యాకేజీ జాబితాలో ఈ ఐదు పంచాయతీలు లేవు. ఇది వారి ప్రధాన సమస్య. దీంతో పాటు ఐదు గ్రామ పంచాయతీల జనాలు.. తమ గ్రామాలకు చెందిన విద్యార్థులు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వారి గ్రామాల్లో చదివి.. ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు భద్రాచలం పట్టణం లేదా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామానికి వెళ్తారు. దీంతో వీరికి స్థానిక విషయంలోనూ రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయ్.

Also read : AP-Telangana : తెలుగు రాష్ట్రాల మధ్య ‘‘ఐదు ఊళ్ల’’ రగడ..

ఈ ఐదు గ్రామ పంచాయతీలకు.. భద్రాచలం నియోజకవర్గ కేంద్రం ఒకటి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక కొత్తగూడెం జిల్లా కేంద్రం 40కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఐతే ఇప్పుడు ఏపీలో కలపడంతో.. నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం 120కిలోమీటర్ల దూరం అవుతోంది. ఇక జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్లు దూరం ఉంది. అక్కడికి వెళ్లాలంటే.. అంత దూరం రెండు ఘాటు రోడ్లు దాటుకొని వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో తమ పంచాయతీలను… తెలంగాణలో కలపాలని గత ఎనిమిదేళ్లుగా ఈ ఐదు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. వరద సమయంలోనూ ఈ ఐదు పంచాయతీలు… భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండడంతో.. ఏపీ అధికారులకు రూట్ మ్యాప్ అర్థం కాలేదు. తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధులే సేవలు అందించిన పరిస్థితి.

ఎటపాక దగ్గర గోదావరి వరద… కరకట్ట పైకి ప్రవహించడంతో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపారు. దీంతో భద్రాచలం పట్టణానికి భారీ ప్రమాదం తప్పింది. కరకట్ట పై నుంచి వరద ప్రవాహం జరిగి ఉంటే ఎటపాక గ్రామంతో పాటు.. రాజుపేట కాలనీ నుంచి భద్రాచలం పట్టణంలోకి వరద నీరు పెద్దఎత్తున వచ్చి తీవ్రనష్టం కలిగించేది. ఐతే ఎటపాక ఏపీ పరిధిలో ఉండడంతో.. కరకట్ట ఎత్తు పెంచాలన్నా.. మరమ్మతులు చేయాలన్నా… తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యం కాని పరిస్థితి. దీంతో తమ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలనే డిమాండ్.. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ఎనిమిదేళ్లుగా భద్రాచలంలో సరైన స్థలం లేకపోవడంతో.. పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి నదిలో వేస్తున్నారు. ఇది కూడా ఐదు గ్రామాలకు ఇబ్బందిగా మారుతోంది. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేవరకు ఆందోళనలు ఆపేది లేదని.. ఐదు గ్రామాల ప్రజలు తెగేసి చెప్తున్నారు. అప్పటివరకు ఆందోళనలు ఆపేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా నాటి అధికారుల అనాలోచిత నిర్ణయం.. ఐదు గ్రామాలు ఎనిమిదేళ్లుగా ఇబ్బంది పడేలా చేస్తోంది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. కేంద్రం దృష్టి సారించి.. తమ సమస్యకు పరిష్కారం చూపించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

 

andhra pradesh,telangana,five villages disputes,polavaram,