శ్రీవారి పూజల కోసం..10 ఎకరాల్లో శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనం

శ్రీవారి పూజల కోసం..10 ఎకరాల్లో శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనం

Tirumala Pavitra  Pushpavanams  : కలియుగ దైవం..పిలిచిన పలికే శ్రీ తిరుమల ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుని నిత్య పూజలు, కైంకర్యాలకు అవసరమైన పుష్పాల కోసం ఐదు ఎకరాల స్థలంలో ఉద్యానవన శాఖ పుష్పవనాన్ని అభివృద్ధి చేసింది.

ఇక్కడ చామంతి, వృక్షి, రోజా, మధురై మల్లెలతో పాటు కనకాంబరాలు, లిల్లీ పూలు, తులసి, పన్నీరు ఆకు, సంపంగిలతో పాలు ఎన్నో రకాల పుష్ప పంటలను వేశారు. వీటిని సేకరరించిన వివిధ రకాల పుష్పాలను ఏప్రిల్, మే నెల నుంచి స్వామికి వినియోగిస్తామని తిరుమల అధికారులు తెలిపారు.

శ్రీవారు పుష్ప ప్రియులు. ఎన్నో రకాల పుష్పాలతో శ్రీవారిని అలంకరిస్తుంటారు. ఎన్ని పూలు ఉన్నా శ్రీవారికి తక్కువే. అలా ఎన్ని ఉద్యానవనాల్లో ప్రత్యేకించి శ్రీవారి కోసమే పూలమొక్కలను సాగుచేస్తుంటారు. తిరుమల కొండపై పూసే ప్రతీ పువ్వూ శ్రీవారి పాదలకే చెందుతుంది. ఆయన మెడలోనే మురిసిపతోంది. ఇప్పటికే శ్రీవారికి కావాల్సిన పూల కోసం ఎన్నో ఉద్యానవనాలను అభివృద్ధి చేసినా తాజాగా మరో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు అధికారులు.

దీంట్లో భాగంగా ప్రకృతి సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్న శిలా తోరణం వద్ద మరో 10 ఎకరాల్లో పవిత్ర ఉద్యానవనాన్ని నిర్మించామని అధికారులు తెలిపారు. ఇది చాలా పవిత్ర ఉద్యానవనమని, ఇక్కడ ఏడు ఆకులను కలిగివుండే అరటితో పాటు ఉసిరి, మోదుగ, జువ్వి, దర్భం, మామిడి, పారిజాతం, కదంబం, రావి అడవి మల్లి, పొగడ, ఎర్ర గన్నేరు, నాబి, మాధీఫలం, బొట్టుగు వంటి 25 రకాల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. దాతల సహకారంతో వీటిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

గోగర్భం జలాశయం వద్ద శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనం తయారవుతోందని, ఇక్కడ ఎర్రచందనంతో పాటు శ్రీగంధం చెట్లను పెంచాలని నిర్ణయించామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక తిరుమలకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు వినియోగిస్తున్న ఘాట్ రోడ్లతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లోనూ పూల మొక్కలను పెంచనున్నామని ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడమే తమ ఉద్దేశమని అన్నారు.