తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 10:54 AM IST
తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

Tirupati SVIMS COVID centre incident: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మకు ఆదేశించారు. మృతురాలు రాధిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆర్ధికంగా ఆదుకుంటామని ఆళ్ల నాని ప్రకటించారు. ప్రమాద కారణాలపై నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్‌ శ్రీ పద్మావతి స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆదివారం(అక్టోబర్4,2020) రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్‌, మొదటి అంతస్తును కరోనా వార్డుగా వినియోగిస్తున్నారు. పై మూడంతస్తుల నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 10.10 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న మహిళా వర్కర్‌ రాధిక(37)పై పడింది. అలాగే, కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పతిలోకి ప్రవేశిస్తున్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పెద్ద పెట్టున గోడకూలిన శబ్దానికి సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు.

తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న రాధికను అంబులెన్స్‌లో స్విమ్స్‌ అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మెడికల్‌ సూపరింటెండెంట్ డాక్టర్‌ రామ్‌ ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారికి కరోనా వార్డులోనే చికిత్స చేస్తున్నారు. గోడ కూలిన ఘటన స్థలాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వీరబ్రహ్మం పరిశీలించారు. గోడ కూలడానికి గల కారణలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు, వారి కుటంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.

కాగా, రాధిక ఆరు నెలల గర్భవతి. కొవిడ్ పేషెంట్లను రాధిక తీసుకెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. రాధిక మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెచ్చులు ఊడిపడటంతో మిగిలిన ఆస్పత్రి సిబ్బంది, పేషెంట్లు కూడా భయాందోళనలో ఉన్నారు.