సినీ పరిశ్రమకు ఊరటనిచ్చిన ఏపీ సర్కార్, టూరిజం రంగం పాలసీకి కేబినెట్ ఆమోదం
fixed electricity charges Film Theaters : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ ఊరటనిచ్చే వార్త వినిపించింది. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసేందుకు డిసైడ్ అయ్యింది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు అంశాలపై చర్చించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీ ప్లెక్స్లతో సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. ఇందుకు నెలకు రూ.3 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుందని అంచనా. మిగిలిన ఆరు నెలలు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది.
రీ స్టార్ట్ ప్యాకేజీ :-
రీ స్టార్ట్ ప్యాకేజీ కింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వాలని, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ. 10 లక్షల చొప్పున, సి – సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడనుందని తెలుస్తోంది. మరోవైపు కోవిడ్ కారణంగా సంక్షోభంలో ఉన్న టూరిజం రంగాన్ని ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంది. దీనికోసం రీస్టార్ట్ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం ప్రకటించింది. హోటళ్లకు, ఫంక్షన్ హాళ్లకు, సర్వీసు ప్రొవైడర్లకు, రెస్టారెంట్లకు మొత్తంగా 3910 యూనిట్లకు రీస్టార్ట్ ప్యాకేజీ వర్తించనుంది. రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకూ ఒక్కో యూనిట్కు రుణ సదుపాయం, రూ. 198.5 కోట్ల రూపాయల రీస్టార్ట్ ప్యాకేజీకి మంత్రి వర్గం అంగీకారం తెలిపింది.
టూరిజం రంగం అభివృద్ధి కోసం :-
ఏపీలో టూరిజం రంగం అభివృద్ధి కోసం రూపొందించిన పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారీ ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించేలా, అందుకు తగిన విధంగా వారిని ప్రొత్సహించే దిశగా పాలసీ ఉండనుంది. కొత్తగా వచ్చే టూరిజం యూనిట్లకు నెట్ ఎస్జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్మెంట్, ఐదేళ్లపాటు యూనిట్ కరెంటు రూ.2లకే, స్టాంపు డ్యూటీలో 100 శాతం రియింబర్స్మెంట్, ల్యాండ్ యూజ్ కన్వెర్షన్ ఛార్జీల్లో 100 శాతం మాఫీ, రూ. 400 కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని మోగా టూరిజం ప్రాజెక్ట్గా పరిగణిచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త మెగా టూరిజం యూనిట్లలో ఫైవ్స్టార్ పైబడి హోదా ఉన్నవారు పార్టనర్గా ఉండాలి. లీజు పీరియడ్ను 33 ఏళ్లనుంచి 99 సంవత్సరాలకు పెంపు.
– చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కు నాబార్డ్ నుంచి రూ.1931 కోట్ల రూపాయల రుణం.
– పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ రైట్ కెనాల్ ఫేజ్–2, కింద మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు.
– ఆరు జిల్లాల్లో రివార్డ్ కార్యక్రమం కింద వాటర్షెడ్ల అభివృద్ధి.
– ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా జాస్తి నాగభూషన్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.