TTD Key Decision : ఆర్ధిక భారం తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

ఆర్థిక భారం తగ్గించడానికి టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాల పర్యవేక్షణను వెనక్కు తీసుకోనుంది.

TTD Key Decision : ఆర్ధిక భారం తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Ttd Key Decision

TTD key decision : ఆర్థిక భారం తగ్గించడానికి టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాల పర్యవేక్షణను వెనక్కు తీసుకోనుంది. దీని వల్ల టీటీడీకి వచ్చే ప్రయోజనమేంటి? ఆలయాలు నిర్వహణ పేరిట ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఖర్చును తగ్గించుకోవడానికి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పరిధిలో ఇప్పటికే 32 ఆలయాలున్నాయి. అయితే తమ ప్రాంతంలోని ఆలయాలను టీటీడీ స్వాధీనం చేసుకుని పర్యవేక్షించాలని పలువురు నేతలు ఎప్పటినుంచో విన్నవిస్తున్నారు.

అయితే వారి వినతులను పక్కన పెట్టింది. కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలే కాదు ఆర్థిక సంస్థలు, ఆలయాలు కూడా కుదేలు అవుతున్నాయి. గత ఏడాది భారత్ పై కోవిడ్-19 పంజా విసరడంతో….2020-21 ఆర్థిక సంవత్సరానికి 12 వందల కోట్ల రూపాయల హుండీ ఆదాయాన్ని అంచనా వేసింది ఆర్థిక విభాగం. లాక్ డౌన్‌తో అంచనాలు అంత తారుమారు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏడు వందల 21 కోట్ల రూపాయలు మాత్రమే శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం లభించింది.

గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కుదిస్తూ రెండు వేల 553 కోట్ల రూపాయలకు పరిమితం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాను రెండు వేల 9 వందల 37 కోట్ల రూపాయలకు అంచనా వేసింది టీటీడీ. అయితే నిత్యం శ్రీవారి హుండీ ద్వారా లభించే ఆదాయం.. లడ్డు విక్రయాలు గతంలో పోల్చితే తగ్గుముఖం పట్టింది. అలాగే ఆర్జిత సేవలు ఏకాంతం చేయడంతో ఆదాయం మరింత తగ్గింది.

అయితే ఆలయాల పరిరక్షణ కోసం టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు నిధులు సమకూర్చడమే కాకుండా….శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ సంకల్పించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గతంలో ఐదు వందల నుంచి ఏడు వందల వరకు శ్రీవారి టిక్కెట్లను కేటాయిస్తూ వస్తోంది టీటీడీ. ప్రస్తుతం కరోనా కారణంగా కేవలం 200 టిక్కెట్లను మాత్రమే రోజువారీగా జారీ చేస్తూ వస్తోంది. దీంతో ఫిబ్రవరి మాసంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఖర్చును తగ్గించే మార్గం ఎంచుకుంది.

ప్రస్తుతం టీటీడీ పరిధిలో 32 ఆలయాలు ఉన్నాయి. వాటి పూర్తి బాధ్యత టీటీడీనే చూసుకుంటుంది. ఈ ఆలయాల్లో టీటీడీ ఉద్యోగితో పాటు…మరి కొందరిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించాల్సి వస్తోంది. తద్వారా ఆలయాలకు వెచ్చించే ఖర్చు మరింత పెరుగుతోంది. ఆలయాలను టీటీడీ పరిధిలో తీసుకుంటే మరింత భారం పెరిగే అవకాశం ఉండటంతో నూతనంగా ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోరాదని తీర్మానించింది. తమ ప్రాంతాల్లో కూడా ఆలయాలను పర్యవేక్షించాలని భారీగా విన్నతులు అందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం ఇప్పుడే కొత్తగా ప్రతిపాదించింది కాదు.

గతంలోనూ అనేకసార్లు టీటీడీ పాలకమండలిలో సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. మొదటి సారిగా 1997లో ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోరాదని అప్పటి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 2005లో మరోసారి ఇదే అంశంపై తీర్మానం చేసారు. ఇక 2012లోనూ ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. దీనిపై ఇంజినీరింగ్, అకౌంట్స్, ఎస్టేట్, న్యాయ, సర్వీసు విభాగాల అధికారులు పరిశీలించి…వారు ఇచ్చే నివేదిక ఆధారంగా పర్యవేక్షణపై తుది నిర్ణయానికి రావాలని అప్పటి పాలకమండలి అభిప్రాయపడింది.

ప్రస్తుతం టీటీడీ పరిధిలో తీసుకోవాలని విన్నతులు వస్తున్న ఆలయాలు మారుమూల ప్రాంతంలో ఉండటం..వాటి ఆదాయం మార్గాలు నామమాత్రంగా ఉండటంతో మరింత భారంగా మారుతున్నాయి. ఇక ఆ ఆలయాలకు సంబంధించిన భూములు., ఇతర ఆస్తులు వివాదాల్లో చిక్కుకోవడం..వాటిని విడిపించేందుకు టీటీడీ భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. ఇక ఆలయాలను పర్యవేక్షిస్తున్న సిబ్బందికి టీటీడీ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది.

పర్యవేక్షణకు తీసుకున్న దేవాలయాల్లో.. అంతకుముందు పండగలు, ఇతర కార్యక్రమాలకు నామమాత్రంగానే నిధులు వెచ్చించేవారు. ఇప్పుడు భారీగా ఖర్చు చేసి భారాన్ని టీటీడీపై మోపుతున్నారు. ఆయా ఆలయాల పరిధిలోని భూవివాదాలు, ఇతర సమస్యలపై న్యాయస్థానంలో పిటిషన్లు వేస్తున్నారు. ఇలా అనేక కేసులు కోర్టులలో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇటువంటి సమస్యలను అధ్యయనం చేసిన టీటీడీ కనీస ఆదాయం లేని ఆలయాల టేకోవర్ చేసే ఆలోచన విరమించుకుంది.