పుష్కర భక్తుల సౌకర్యార్థం ఉచితంగా ఇ – టికెటింగ్ బుకింగ్… మంత్రి వెల్లంపల్లి
Tungabhadra pushkarams slots up for online booking : Vellampalli : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభధ్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కోవిడ్ మార్గదర్శకాలను అనుగుణంగా తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో సమర్ధ వంతంగా చేపట్టడం జరిగిందన్నారు. శుక్రవారం నవంబర్ 20, మధ్యాహ్నం 1.21 గంటలకు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అయి డిశంబరు 1 వరకు 12 రోజులుపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు .
పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని రహదారులు, ఘాట్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీల రహదారులను, కర్నూలు నగరంలోని రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందని వెల్లంపల్లి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్నానఘట్టాల వద్ద జల్లు స్నానంను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
భక్తులు, ధార్మిక సంస్థలు, అనుబంధ సంస్థలు సహకరించాలని మంత్రి కోరారు. తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని మొత్తం 23 ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగిందని దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
కర్నూలులో 1,మంత్రాలయంలో6, కోడుమూరులో 5, ఎమ్మిగనూరులో2, నందికొట్కూరులో ఒక ఘాట్ ఏర్పాటు చేసామన్నారు. రెవెన్యూ, పోలీస్,మున్సిపల్,వైద్య,ఆరోగ్య,దేవాదాయ,మత్స్య,అగ్నిమాపక,ఇరిగేషన్, తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లను చేయడం జరిగిందని మంత్రి వెలంపల్లి తెలిపారు .
https://10tv.in/tungabhadra-pushkaralu-starts/
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని, పవిత్ర తుంగభద్ర పుష్కరాలకు వచ్చే యాత్రీకులు పిండప్రదాన, తదితర పూజా కార్యక్రమాలను నిర్వర్తించేందుకు అనుగుణంగా 350 మంది పురోహితులను అందుబాటులో ఉంచామన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచితంగా ఇ-టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇ-టికెట్ ను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచడంతో పాటు వచ్చిన యాత్రికులకు కరెంటు బుకింగ్ ద్వారా కూడా కేటాయిస్తామన్నారు.
ఏఘాట్ కు వెళ్లాలి, ఏ సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి వంటి వివరాలను తెలియజేస్తామన్నారు. అందుకు అనుగుణంగా భక్తులు సహకారం అందించాలని వారికి కేటాయించిన ఘాట్లలో సంబంధిత కార్యక్రమాలను నిర్వర్తించుకోవాలన్నారు.
అత్యంత పకడ్బంధీగా తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను చేశామని.. ఇందుకోసం 23 మంది ఇన్ఛార్జ్ లను నియమించామని వీరికి అదనంగా 16 కమిటీలతో కూడిన నోడల్ అధికారులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. గత ప్రభుత్వం హయాంలో కృష్ణా,గోదావరి పుష్కరాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘాట్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కోవిడ్ మార్గదర్శకాల దృష్ట్యా భక్తులను, యాత్రీకులను ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఘాట్లలోకి అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు .