మోదీ, షా, నడ్డా సారధ్యంలో ఏపి బీజేపీ బలోపేతం
Union Minister of state G.Kishan reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా విజయవాడలో అక్టోబర్ 25 పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కిషన్ రెడ్డి మట్లాడుతూ …. కృష్ణా నదీ తీరాన, కనకదుర్గమ్మ పాదాల చెంతన దసరా రోజున బిజెపి రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరకీ మంచి జరగాలని పేర్కొంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం చేసుకుని.. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ, నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో భాజపా బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం అమలు చేస్తున్న పధకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు. దేశంలో అత్యధిక మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కువుగా ఉన్న పార్టీ కూడా బిజెపినే అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బిజెపి బలపడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు.
పదవుల్లో ఉన్నా లేకున్నా బిజెపి నేతలు కుటుంబంలా కలిసి పార్టీ ని ముందుకు తీసుకెళ్లాలలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మోదీ సారధ్యంలో పనిచేస్తాం అన్నారు. సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉంటూ నేడు అధ్యక్షులుగా పని చేస్తున్నారని తెలిపారు.
కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని ఆయన అన్నారు. ఏపీలో బిజెపి బలమైన శక్తిగా, ప్రజా గొంతుకగా రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా, తన తరపున ప్రజలందరకీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.