జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీ ఎందుకు పక్కన పెట్టింది? : వల్లభనేని వంశీ

  • Published By: vamsi ,Published On : November 14, 2019 / 11:59 AM IST
జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీ ఎందుకు పక్కన పెట్టింది? : వల్లభనేని వంశీ

తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. గతకొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన క్రమంలో ఆయన జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు దేశం పార్టీ పక్కన పెట్టిందని విమర్శించారు. పదవి పోయిందని వెంపర్లాడితే ఎలా అని పొత్తు లేకుండా పార్టీ ఎన్నికలకు వెళ్లట్లేదని, పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్న వాళ్లతో కయ్యానికి దిగుతారని చంద్రబాబుని విమర్శించారు.

2004లో 47సీట్లు తెచ్చుకున్న తెలుగు దేశం పార్టీ 2009లో 90సీట్లు గెలుచుకుందని, అప్పుడు 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని, కెరీర్ ని పణంగా పెట్టి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని పదేళ్లలో ఒక్కసారి అయినా పట్టించుకున్నారా? అని విమర్శించారు వల్లభనేని వంశీ. 2014లో కూడా బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చి తప్పుడు మాటలు విని వాళ్లతో పొత్తులు చెడగొట్టుకుని ఒంటరిగా పోటీ చేశారని అన్నారు వల్లభనేని వంశీ.