విజయవాడ గ్యాంగ్ వార్: వాళ్లకు అసలు డబ్బులెక్కడివి?
విజయవాడలో జరిగిన గ్యాంగ్వార్ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిపోయింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సినిమాల్లో మాదిరిగా గ్యాంగ్లను నడిపేందుకు వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. గ్యాంగ్ల నిర్వహణ కోసం ఎంత ఖర్చు చేస్తుంటారు. ఈ గ్యాంగ్లతో ఎలాంటి పనులకు పాల్పడుతారు అనేదానిపై పోలీసులు దృష్టిపెట్టారు.
ఫస్ట్ పంచాయితీ విషయంలోనే వీరికి గొడవ జరిగిందా? లేక ఇంతకుముందు కూడా ఇలాంటి పంచాయితీలు వీళ్లు చేశారా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. లేటెస్ట్గా జరిగిన గ్యాంగ్ వార్లో పక్కనే ఉన్న మంగళగిరి నుంచి సైతం కొందరు వచ్చి పాల్గొనడంతో.. ఇంకా ఇలాంటి వారి ప్రమేయం ఏమైనా ఉందేమోనని ఆరా తీస్తున్నారు పోలీసులు. దీనికోసం నిందితుల కాల్ రికార్డులు, సోషల్మీడియా ఖాతాల్లోని వివరాలు సేకరిస్తున్నారు.
సందీప్, పండు ఇద్దరి గ్యాంగ్లలో ఉన్న పాతిక మంది వరకూ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక గ్యాంగ్కు చెందిన 12మంది, మరో గ్యాంగ్కు చెందిన 13మంది ఉన్నట్టు తెలిసింది. మరికొందరు నిందితులు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించడంతో ఆరు బృందాలు వేర్వేరుగా గాలింపు చర్యలను చేపట్టాయి. అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు వేర్వేరు చోట్ల రహస్యంగా విచారిస్తున్నారు.
ఈ సమయంలో ఘర్షణకు కారణాలు, కొట్లాటకు ముందు ఏం జరిగింది? ఎప్పటి నుంచి ఈ రెండు గ్రూపుల మధ్య వైరం ఏర్పడిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. కత్తులు, రాడ్లతో భయానక వాతావరణం సృష్టించిన రెండు గ్యాంగుల్లోని సభ్యులపై రౌడీషీట్ తెరిచే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. మరో రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు. లేటెస్ట్గా ఈ రెండు గ్యాంగ్ల మధ్య వార్కి కారణం.. పెనమలూరు సెటిల్మెంటే అని అంటున్నారు. నాగబాబు అనే వ్యక్తి ఈ సెటిల్మెంట్కు తెరతీసినట్లుగా భావిస్తున్నారు. ఇతను రియల్ఎస్టేట్తో పాటూ ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాడని సమాచారం.
వివాదాల్లో ఉన్న అపార్ట్మెంట్లు, స్థలాల వివరాలను సేకరించి.. వాటిని పరిష్కరించేందుకు నాగబాబు మధ్యవర్తిత్వం చేస్తుంటారు. నాగబాబును అదుపులోనికి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. గతంలో చేసిన సెటిల్మెంట్ల విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు.
Read: ఇళ్ల స్థలాల పేరిట దందా : 10tv స్టింగ్ ఆపరేషన్ ను అభినందించిన నారా లోకేష్