Vijayawada Durgamma: దుర్గగుడి హుండీల లెక్కింపులో చేతివాటం..మహామండపం బాత్‌రూమ్‌లో దాచిన బంగారం గుర్తింపు

Vijayawada Durgamma: దుర్గగుడి హుండీల లెక్కింపులో చేతివాటం..మహామండపం బాత్‌రూమ్‌లో దాచిన బంగారం గుర్తింపు

Vijayawada Durgamma (1)

Vijayawada  Kanaka durgamma temple  gold :  అమ్మలగన్న అమ్మ విజయవాడ ఇంద్రీకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకే టోకరా వేసేందుకు యత్నించారు కొందరు ఆలయ సిబ్బంది. 12 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దుర్గమ్మ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారు కానుకలను అపహరించటానికి యత్నించారు. సోమవారం (మే 9,2022)శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం మహామండపం ఆరవ అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది.

ఈక్రమంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పురుషులు ఉపయోగించే బాత్‌రూమ్‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ ఉన్న వెస్ట్రన్‌ టాయిలెట్‌ పక్కన రెండు చిన్న ప్లాస్టిక్‌ కవర్లను గుర్తించారు. వీటిని వారు ఈవో భ్రమరాంబకు అప్పగించారు. దుర్గమ్మ భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతోపాటు గతంలో వెండి సింహాల మాయమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ఆలయ అధికారులు ఈ ఘటనకు సంబంధించి విషయాలను బయటకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నా విషయం కాస్తా బయటపడింది. మరోసారి ఆలయ సిబ్బంది చేతివాటం బయటపడింది.

కాగా దుర్గమ్మ హుండీల లెక్కింపు పకడ్బందీగా జరుగుతుంది. సీసీ కెమెరాల నిఘా, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పహరా నడుమ లెక్కింపు ప్రాంతం వద్ద గట్టి నిఘా ఉంటుంది. కానుకలను లెక్కించడానికి వచ్చినవారిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. లెక్కింపు పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న సమయంలో కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరి ఇంత గట్టి బందోబస్తు ఉన్నప్పటికీ  అమ్మవారి కానుకలను దొంగిలించే ప్రయత్నం జరగడంపై ఆలయ అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. దొంగలెవరు అన్నదానిపై అంతర్గతంగా సిబ్బందిని విచారించి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఇంటి దొంగలెవరో నిగ్గు తేల్చే పనిలో పడ్డారు ఆలయ అధికారులు. ఈ ఘటన సోమవారమే జరిగినా బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు ఆలయ అధికారులు. సోమవారం రాత్రి వరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లుగా తెలుస్తోంది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.