Visakha NRI Murder Case : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్యే.. విశాఖలో ఎన్ఆర్ఐ హత్య కేసులో వీడిన మిస్టరీ

విశాఖలో ఎన్ఆర్ఐ సతీశ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య రమ్యే

Visakha NRI Murder Case : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్యే.. విశాఖలో ఎన్ఆర్ఐ హత్య కేసులో వీడిన మిస్టరీ

Visakha Nri Murder Case

Visakha NRI Murder Case : విశాఖలో ఎన్ఆర్ఐ సతీశ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య రమ్యే భర్త సతీష్ ను చంపిందని పోలీసులు వెల్లడించారు. రమ్య స్కూల్ లో ఉన్నప్పుడు భాషా అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇటీవల మళ్లీ స్కూల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక్కటయ్యారని పోలీసులు తెలిపారు. తమ బంధానికి అడ్డు అని భావించి చంపేందుకు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. గత వారం భాషా రాడ్ తో కొట్టి సతీష్ ను చంపేశాడు.

సతీశ్ భార్య రమ్య, ఆమె ప్రియుడు భాషా హత్యకు సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. విశాఖలోని పీఎం పాలెం దగ్గర నివాసముంటున్న సతీష్ గతవారం ఎన్జీవో కాలనీలో రోడ్డుపై భార్యా పిల్లలతో కలిసి వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాడ్ తో దాడి చేయడంతో హత్యకు గురయ్యాడు.

దీనిపై భార్య రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో దుబాయ్‌లో స్నేహితుడు సుధాకర్ రెడ్డితో కలిసి సతీశ్ కొన్ని వ్యాపారాలు నిర్వహించాడు. లావాదేవీల్లో తేడా రావడంతో సతీష్ ఇండియాలోనే ఉండిపోయాడు. దీనిపై ఇద్దరి మధ్య ఫోన్ లో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ దశలో సతీష్ హత్యకు గురికావడంతో అతని స్నేహితుడు సుధాకర్ రెడ్డి చేయించి ఉంటాడని రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో సుధాకర్ రెడ్డి ప్రమేయం లేనట్టు తేలింది.

మరింత లోతుగా విచారణ సాగించిన పోలీసులకు సతీష్ భార్య రమ్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆ దిశగా విచారణ చేయగా దిమ్మతిరిగే నిజం వెలుగులోకి వచ్చింది. స్కూల్ లో చదివే సమయంలో రమ్య.. భాషా అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ టెన్త్ వరకు ఒకే స్కూల్ లో చదివారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంతకాలం రిలేషన్ నడిచింది. ఆ తర్వాత రమ్యకి సతీష్ తో, భాషాకి మరొకరితో పెళ్లైంది. అయినా భాషాతో రమ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో ఇద్దరూ వేరే చోటుకి వెళ్లి కలిసి ఉండాలని అనుకున్నారు. అయితే అది కుదరలేదు.

దీంతో భర్తను చంపేస్తే ప్రియుడితో కలిసి ఉండొచ్చని రమ్య అనుకుంది. మర్డర్ స్కెచ్ వేసింది. తన భర్త సతీష్‌ను ప్రియుడు భాషాతో చంపించింది రమ్య. ఆ నేరాన్ని వ్యాపార విభేదాలున్న సుధాకర్ రెడ్డి పై నెట్టాలని చూసింది. కానీ.. కథ అడ్డం తిరిగింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ కేసులో ఏ-1గా భాషా, ఏ-2గా రమ్య ఉన్నారని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు రమ్య, భాషా రెక్కీ కూడా చేసినట్లు పోలీసులు చెప్పారు. సీసీ కెమెరాలు లేని చోట హత్యకు స్కెచ్ వేశారు. సతీష్, రమ్య దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి చనిపోయాడు, తల్లి జైల్లో ఉంది. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.