ఆలయాల పేరుతో బీజేపీ డ్రామాలు
MLA Vasupalli Ganesh Kumar angry with the BJP : విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మరింత విస్తరించేందుకే ఏపీలో ఆలయాల పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతోందని గణేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం (జనవరి 20, 2021) ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గొరిల్లా వార్ ఫెయిర్ నడుస్తోందని విమర్శించారు. సీసీ కెమెరాలు లేని ఆలయాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు ఫిబ్రవరి 4 నుంచి బీజేపీ చేపట్టబోయే యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా తాము మాత్రం నిర్వహించి తీరుతామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి. ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యర్ని కలిసిన బీజేపీ నేతలు… యాత్రకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను అడిషనల్ డీజీపీకి అందజేశారు.
సోమువీర్రాజు నేతృత్వంలో జనసేనతో కలిసి కపిలతీర్థ నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడుతామని.. ఆయా ప్రాంతాల్లో ధ్వంసం చేసిన ఆలయాలను పరిశీలిస్తామని వివరించారు. ఈ యాత్రలు, సభలలో పలువురు బీజేపీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారని అడిషనల్ డీజీపీకి చెప్పారు.
శాంతియుతంగా చేపట్టే ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారనే భావిస్తున్నామని విష్ణువర్ధన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడితో అనుమతి ఇవ్వకుంటే.. తమ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. హిందువుగా ఆలయాలను దర్శించుకునే స్వేచ్ఛ తమకుందన్నారు.