విశాఖపోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు..ఎలాంటి ప్రమాదం లేదంటున్న నిపుణులు

  • Published By: madhu ,Published On : August 7, 2020 / 04:39 PM IST
విశాఖపోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు..ఎలాంటి ప్రమాదం లేదంటున్న నిపుణులు

లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన పేలుడుతో విశాఖ ఉలిక్కిపడింది. అక్కడ జరిగిన పేలుళ్లలో సుమారు 70 మందికి చనిపోగా..4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాంలో ప్రమాదం జరిగినట్లు, పేలుళ్లకు ప్రధాన కారణం..అమ్మోనియం నైట్రేట్ అని భావిస్తున్నారు. దీంతో అందరి చూపు విశాఖపై పడింది. కానీ ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు నిపుణులు.



రష్యా, గల్ఫ్ దేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా..ప్రైవేటు వినియోగదారులు అమ్మోనియం నైట్రైట్ ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటుంటారు. నౌకల నుంచి అన్ లోడ్ చేసుకుని..సమీపంలో ఉన్న గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. తర్వాత ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు దిగుమతి చేస్తుంటారు. ఏటా రెండు లక్షల టన్నుల అమ్మోనియం నైట్రైట్ దిగుమతి అవుతుందని అంచనా. 2018-19లో విశాఖ పోర్టులో 2.60 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రైట్ దిగుమతి జరిగింది. సగటున విశాఖ పోర్టులో 30 వేల టన్నుల నిల్వ ఉంటుంది. అంటే..బీరూట్..లో ఉన్నదానికంటే..పది రెట్లు ఎక్కువ. ఇదే ఇప్పుడు ఆందోళన నెలకొంటోంది.

అయితే..ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉండవని, కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు అధికారులు వెల్లడిస్తున్నారు. పకడ్బందిగా అన్ లోడ్ చేయడం జరుగుతుందని, పేలుళ్లు జరిగే పరిస్థితులు లేవని నిపుణులు, అధికారులు వెల్లడిస్తున్నారు. విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని, దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



పకడ్బంది చర్యలు తీసుకోవడం వల్లే…విశాఖపట్టణం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చిందని, దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతున్నా..ఎలాంటి ప్రమాదం జరగలేదనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్ తో వచ్చిన నౌకకు స్థానిక పోలీసు శాఖ, కస్టమ్స్, సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక శాఖ, పెసో మొదలైన శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులుండాలని పోర్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

అన్ లోడ్ జరుగుతున్నంత సేపు…బెర్త్ వద్ద ఫైర్ టెండర్ ని పోర్టు సిద్ధంగా ఉంచుతుందని స్పష్టం చేస్తున్నారు. విశాఖ నుంచి 35 రోజుల్లోపే..ఆయా రాష్ట్రాలకు తరలిస్తామని, సురక్షితంగా హ్యాండ్లింగ్ చేసే సౌకర్యం ఉన్నందువల్లే..విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో ముఖ్యమైన విషయం..పేలుడు జరగాలంటే..ఏదైనా రసాయనంతో కలవాలి..ఇవన్నీ ఇక్కడ జరిగే ప్రసక్తే లేదని షిప్పింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు.



ఎక్కువ కాలం నిల్వ ఉంటే..పేలుడు సంభవిస్తుందని, కానీ ఇక్కడ ఉన్న గౌడెన్ల నుంచి నెల రోజుల్లోనే..అమ్మోనియం నైట్రేట్ మొత్తాన్ని తరలిస్తున్నామంటున్నారు.