డాక్టర్ రమేష్ ను మీ ఇంట్లో దాచారా? మీ కొడుకు ఇంట్లో దాచారా? చంద్రబాబుని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రముఖ డాక్టర్, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ బాబు పరారీ అయ్యారు. స్వర్ణ ప్యాలెస్లో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది రమేష్ ఆసుపత్రే కావడంతో ఆయనపై కేసు నమోదైంది. విజయవాడ నగర పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, కేసు నమోదు చేసిన వెంటనే డాక్టర్ రమేష్ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఆచూకీ చెబితే వారికి లక్ష రూపాయలు బహుమతి కూడా ఇస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు.
తాజాగా డాక్టర్ రమేష్ అజ్ఞాతంపై వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబుని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. డాక్టర్ రమేష్.. తెలుగుదేశం పార్టీకి చెందిన బడా నేతల నివాసాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ నేతల ఇళ్లల్లో గాలింపు చర్యలు చేపడితే.. డాక్టర్ రమేష్ ఆచూకీ తెలుస్తుందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.
డాక్టర్ రమేష్ను ఎవరి ఇంట్లో దాచి ఉంచారని చంద్రబాబుని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. డాక్టర్ రమేష్ను మీ ఇంట్లో దాచి ఉంచారా లేక మీ కొడుకు లోకేష్ ఇంట్లో దాచి ఉంచారా? అని చంద్రబాబుని క్వశ్చన్ చేశారాయన. అసలు డాక్టర్ రమేష్, నిమ్మగడ్డ రమేష్ తో మీకున్న అనుబంధం ఏమిటో తెలియజేయాలంటూ చంద్రబాబును నిలదీశారు. ఇద్దరు రమేష్లతో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో ఆగస్టు 9వ తేదీ సంభవించిన అగ్నిప్రమాదంలో పదిమంది పేషెంట్లు మరణించిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో పలువురికి కరోనా నెగిటివ్ ఉంది. ఈ ఘటనకు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అని దర్యాఫ్తులో తేలింది. రమేష్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేష్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు.
చంద్రబాబూ…. నేరుగా అడుగుతున్నా.
ఇంతకీ డాక్టర్ రమేష్ ను మీ ఇంట్లో దాచారా? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?— Vijayasai Reddy V (@VSReddy_MP) August 24, 2020