Widow Pension : మగాడికి వితంతు పింఛన్.. 12ఏళ్ల తర్వాత వెలుగులోకి

కనీవిని ఎరుగని విచిత్రమైన వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ఓ గ్రామంలో మగాడికి వితంతు పింఛన్ మంజూరు అవుతోంది. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పసిగట్టలేకపోవడం మరింత విడ్డూరం.

Widow Pension : మగాడికి వితంతు పింఛన్.. 12ఏళ్ల తర్వాత వెలుగులోకి

Widow Pension

Widow Pension : వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పలు సామాజిక పెన్షన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వితంతు పింఛన్ ఒకటి. భర్త చనిపోయి ఒంటరైన మహిళలకు ప్రభుత్వం ఈ పెన్షన్ అందిస్తోంది. కాగా, చాలా చోట్ల అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కనీవిని ఎరుగని విచిత్రమైన వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. ఓ గ్రామంలో మగాడికి వితంతు పింఛన్ మంజూరు అవుతోంది. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పసిగట్టలేకపోవడం మరింత విడ్డూరం.

2009లో పెన్షన్ మంజూరు:
కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తికి పెన్షన్ మంజూరవుతోంది. అతడి పెన్షన్ ఐడీ 113529781. 2009లో పెన్షన్ మంజూరైంది. అప్పటి నుంచి అతడు నెల నెల పెన్షన్ తీసుకుంటున్నాడు. అధికారులు గుర్తించడంతో ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు పురుషుడికి వితంతు పెన్షన్ ఎలా మంజూరైందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.

గుంటూరులో బయటపడ్డ వ్యవహారం:
కాశీం ఉపాధి నిమిత్తం కొంతకాలం గుంటూరు జిల్లాకు వలస వెళ్లాడు. వినుకొండ నియోజకవర్గంలోని చిట్టాపురం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ దగ్గరికి ఏప్రిల్ 4న పింఛన్ కోసం వెళ్లాడు. అయితే కార్డును చూసిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కి దిమ్మతిరిగింది. మగాడికి వితంతు పింఛన్ రావడం ఆశ్చర్యం కలిగించింది. అసలు నీకు వితంతు పింఛన్ ఎలా వస్తుందని ప్రశ్నించాడు.

ఇలాంటి పెన్షన్లు ఇంకా ఎన్ని ఉన్నాయో:
అందుకు కాశీం సరైన సమాధానం చెప్పలేకపోయాడు. వెంటనే అక్కడి అధికారి డోన్‌ మండలం ఎద్దుపెంట సచివాలయ అధికారులతో పాటు మండల అధికారులకు సమాచారం ఇచ్చాడు. జరిగిన పొరపాటును గుర్తించిన జిల్లా, స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు. పింఛన్ ఎవరు మంజూరు చేశారు, ఇన్నేళ్ల పాటు నిర్లక్ష్యంగా పింఛన్‌ ఎలా ఇచ్చారు.. ఇదే తరహాలో పింఛన్లు ఇంకా ఏమైనా ఉన్నాయా అని విచారణ చేస్తున్నారు. వితంతు పింఛన్ వ్యవహారాన్ని డీఆర్‌డీఏ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

కావాలనే చేశారా?
ఒక పురుషుడికి వితంతు పెన్షన్ మంజూరవడమే విడ్డూరంగా ఉంది. కావాలని చేశారా…? లేక పొరబాటున మంజూరు చేశారా అనేది తెలియాల్సి ఉంది. 2009లో పెన్షన్ తక్కువగా ఉండటంతో వాటిని అందించే సిబ్బంది కూడా పట్టించుకోనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2వేలకు పైగా పెన్షన్ అందడంతో ప్రతి ఒక్కరి అర్హతను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కాశీం వ్యవహారం బయటపడింది. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.