Tirupati Bypoll : తిరుపతిలో జనసేనానీ ప్రచారం చేస్తారా ? షరతులు పెట్టారా ? అవి ఏంటీ ?
తిరుపతిలో జనసేనాని ప్రచారం చేస్తారా..? ఉమ్మడి పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు నిజంగా ఉందా..? ప్రచారానికి వచ్చేందుకు పవన్ షరతులు పెట్టారా..?
Pawan Kalyan : తిరుపతిలో జనసేనాని ప్రచారం చేస్తారా..? ఉమ్మడి పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు నిజంగా ఉందా..? ప్రచారానికి వచ్చేందుకు పవన్ షరతులు పెట్టారా..? మరి క్యాంపెయిన్కు రావాలంటే జనసేనాని పెట్టిన కండీషన్స్ ఏంటి..? వాటిపై బీజేపీ ప్లాన్స్ ఏంటి..? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు కోసం చేసే పోరాటంలో.. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ మద్దతు ఉంటే తప్ప తిరుపతిలో గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకోలేమని బీజేపీ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పవన్ను తిరుపతి ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ సహా.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ను కలిశారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కల్యాణ్తో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే.. తాను ప్రచారానికి రావాలంటే బీజేపీ ఏం చేయాలో కండీషన్స్ పెట్టారట పవన్ కల్యాణ్. ఆ షరతులు బీజేపీ ప్రయోజనాల కోసమే అన్నట్లు ఉన్నా.. ఆ పార్టీ నేతలకు పవన్ వైఖరి రుచించడం లేదని టాక్ వినిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్షా, స్మృతి ఇరానీ, నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి తదితరులు తిరుపతికి వస్తే.. తాను కూడా ప్రచారం చేస్తానని పవన్ షరతులు పెట్టినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకే అగ్రనేతలు వచ్చినప్పుడు, తిరుపతికి మాత్రం ఎందుకు రారనేది పవన్ కల్యాణ్ ప్రశ్న.
నిజంగా తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ సీరియస్గా తీసుకుని ఉంటే.. అగ్ర నేతలందరినీ రప్పిస్తానని ఎందుకు చెప్పడం లేదని పవన్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికను బీజేపీనే సీరియస్గా తీసుకోనప్పుడు, తాను వచ్చి ప్రచారం చేసి పరువు పోగొట్టుకోలేనని పవన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తమ వైపు తిప్పుకోవడం అంత సులభం కాదనేది బీజేపీ నేతల అభిప్రాయం. బీజేపీకి తమ నాయకుడు పవన్కల్యాణ్ మద్దతు తెలుపుతుంటే.. ప్రచారానికి ఎందుకు రారనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తంగా… జనసేన ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోకుంటే అత్యధికంగా టీడీపీ ప్రయోజనం పొందుతుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. దీంతో పవన్ కల్యాణ్ను ప్రచారానికి రప్పించడం బీజేపీకి ఓ సవాల్గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.