ప్రియురాలితో కల్సి భార్యను వేధించిన భర్త….. కూతురుతో సహా ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : August 24, 2020 / 04:08 PM IST
ప్రియురాలితో కల్సి భార్యను వేధించిన భర్త….. కూతురుతో సహా ఆత్మహత్య

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిసికూడా వాటిపై మోజు పెంచుకుని బంగారం లాంటి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు. అగ్ని సాక్షిగా  తాళి కట్టిన భర్త తన ఎదుటే ప్రియురాలితో కాపురం చేస్తుంటే…. చూసి భరించలేని ఇల్లాలు రెండేళ్ల చిన్నారితో సహా ఆత్మహత్య చేసుకుంది.



కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన నాగార్జున మేనమామ కూతురు శిల్పను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పాప పుట్టింది. కొన్నాళ్ల తర్వాత బ్యాంకు పరీక్షలకు కోచింగ్ తీసుకోవటం కోసం కర్నూలు వెళ్ళాడు. అక్కడ అతనికి ఓ మహిళ పరిచయం అయ్యింది. క్రమేపి ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఆ మహిళ మోజులో పడి భార్యా పిల్లలను పట్టించుకోవటం మానేశాడు. ఇంట్లో భార్య పిల్లను వదిలేసి ఆ మహిళతోనే కాపురం పెట్టాడు నాగార్జున. దీంతో శిల్ప, తన కూతురుతో అత్తమామల వద్దే ఉంటోంది. నాగార్జున ప్రియురాలి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి ప్రియురాలి బంధువులు శిల్పను వేధించ సాగారు. ఆ వేధింపులు తట్టుకుని శిల్ప మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇంతలో ఉన్నట్టుండి ఒకరోజు నాగార్జున ప్రియురాలిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు.



భార్య కళ్లముందే ప్రియురాలితో కాపురం పెట్టాడు. భార్య, కూతుర్ని వేధించటం మొదలెట్టాడు. భర్త వేధింపులను భరించలేని శిల్ప తీవ్రమనస్తాపానికి గురైంది. ఆదివారం , ఆగస్ట్ 23న పొలం పక్కనే ఉన్న నీటి కుంటలో కూతురుతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్దానికులు వెంటనే వారిని బయటకు తీసినప్పటికీ తల్లికూతురు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.

నాగార్జున తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులుకేసు నమోదు చేశారు. నాగార్జున, అతని ప్రియురాలు, ఆమె బంధువుల వేధింపుల వల్లే శిల్ప, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోంది.