చంద్రబాబు శాడిజం ఏంటో అర్థం కావడం లేదు
YCP counter to Chandrababu’s comments : చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు తీరు దబాయింపు ధోరణిలో ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై ఏమనుకోవాలో అర్థం కావట్లేదన్నారు. గురువారం (జనవరి 21, 2021) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. డీజీపీని ఉద్దేశించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ఆవేశం అని అడిగారు.
చంద్రబాబు శాడిజం ఏంటో అర్థం కావడం లేదన్నారు. దేవుడి విగ్రహాలపై కంపరంగా మాట్లాడారని తెలిపారు. విగ్రహాలను ఎవరైనా రాజకీయ నాయకులు తీసుకెళ్తారా? చంద్రబాబుకు ఎందుకు ఇంత ఆవేశం.. చిన్నపిల్లల కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 41 సీఆర్పీసీ నోటీసు గురించి చంద్రబాబుకు అవగాహన లేదా అని ప్రశ్నించారు. చట్టం గురించి అడుగుతున్నారు..చంద్రబాబుకు చట్టం తెలుసా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ను టార్గెట్ చేయడమే చంద్రబాబు లక్ష్యమని సజ్జల పేర్కొన్నారు. నిన్న జరిగింది కళా వెంకట్రావు అరెస్ట్ కాదని.. కేవలం పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కళా వెంకట్రావు అరెస్ట్ జరగకపోయినా జరిగినట్లు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయంగా పతనం అయ్యారని విమర్శించారు.
కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్లు పెడతారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలు జరిపి ప్రజలను, ఉద్యోగులను బలి పశువులను చేయాలంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. ఎస్ఈసీ రాసిన లేఖలో ఎన్నికలకు సంబంధం లేని అంశాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.