రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబే!

రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబే!

Kodali Nani

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో మరోసారి మండిపడ్డారు. బీజేపీ నోటా కంటే ఎక్కువ ఓట్లు రాబట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ దొంగపార్టీ అని, ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, అవినీతి చక్రవర్తి చంద్రబాబే రాష్ట్రం విడిపోవడానికి కారణం అని కొడాలి నానీ అన్నారు. కేసీఆర్ పార్టీ నుంచి పోవడానికి, రాష్ట్రం ముక్కలు అయ్యి అసమానతలు వచ్చేట్లు.. చెయ్యడానికి చంద్రబాబే కారణం అన్నారు. ప్రజలను మనుషులుగా కూడా గౌరవించలేని వ్యక్తి చంద్రబాబే అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు బుద్ధిలేదు, సిగ్గులేదు, మీరు మనిషులేనా అంటూ అవమానించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని విమర్శలు చేస్తున్నవారికి.. చంద్రబాబు చేసిన అప్పులు కనిపించలేదా అని ప్రశ్నించారు. జగన్ ప్రజాసంక్షేమం చేస్తుంటే.. చంద్రబాబు లక్షల కోట్లు తీసుకొచ్చి ఒక్క ప్రాంతంలో పెట్టారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో.. 20లక్షల రూపాయలు విలువైన భూమి రూ. 5కోట్లు పలికిందని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్‌కు నిజమైన వారసుడు వైఎస్ జగనేనని, విపత్కర సమయంలో జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

ఇదే సంధర్భంగా.. తిరుమల శ్రీవారిపై రాజకీయాలు చేస్తున్నారని, తలనీలాల వ్యవహారాన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని అన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీ నోటాను క్రాస్ చేసేందుకు తంటాలు పడుతోందని బీజేపీని ఎద్దేవా చేశారు. తిరుపతిలో 5 లక్షల మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకో పార్టీ డిపాజిట్లు వస్తే చాలు అని కోరుకుంటుందని అన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఈ పనికిమాలిన పార్టీలను ఆ స్వామే మసి చెయ్యాలని అన్నారు.