నా పేరు చెప్పి భూ దందా చేస్తే ఖబడ్దార్… మంత్రులు, ఎమ్మెల్యేలున్నా క్షమించను

  • Published By: bheemraj ,Published On : August 15, 2020 / 08:59 PM IST
నా పేరు చెప్పి భూ దందా చేస్తే ఖబడ్దార్… మంత్రులు, ఎమ్మెల్యేలున్నా క్షమించను

విశాఖలో భూముల సెటిల్ మెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి భూ సెటిల్ మెంట్లు చేసే వారు ఎంతటి వారైనా వదలబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కూడా భూ ఆక్రమణల విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారని తలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరున్నా క్షమించేది లేదన్నారు. ఇక తన పేరు ఉపయోగించి భూములు సెటిల్ మెంట్లు చేసే వారిపై కేసులు పెట్టించి, అరెస్టులు చేయిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ఎండోమెంట్ ఏ భూముల జోలికొచ్చినా వదలబోమన్నారు.

శనివారం (ఆగస్టు 15, 2020) విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా పని చేస్తుందన్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఎంత పెద్ద వ్యక్తైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తైనా ఊపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, దేవస్థానం భూములు, చర్చీ భూములు, మసీదు భూములను ఆక్రమించేందుకు ఎవరు ప్రయత్నించినా, దొంగ రికార్డులు సృష్టించేందుకు ప్రయత్నం చేసినా సంబంధిత అధికారులు, అందులో ఇన్ వాల్వ్ అయిన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రలు… ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు.

తన పేరు ఉపయోగించుకుని కొంతమంది భూ దందాలు చేస్తున్నారన్న మాట వాస్తవమన్నారు. అది తన దృష్టికి వచ్చినట్లైతే ఎంత పెద్ద వ్యక్తైనా వారిపై కేసు పెట్టి అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇస్తామని చెప్పారు.