పెళ్లి రోజున శంకుస్థాపన, నాకు గుర్తుండిపోతుంది – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : August 28, 2020 / 12:57 PM IST
పెళ్లి రోజున శంకుస్థాపన, నాకు గుర్తుండిపోతుంది – సీఎం జగన్

పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చిన వెంటనే, 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశామన్న ఆయన..ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈప్రాజెక్టును పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.



నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదని, దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. 38,627 ఎకరాలకు నీరు అందిస్తామని, డీబీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా నీరు అందిస్తామన్నారు.

దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించే లక్ష్యంతో ముందుకెళుతామని, రూ. 490 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరుతుందన్నారు. ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు.



రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోని, కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఉందని, 5 ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారాయన.
https://10tv.in/chiranjeei-responce-on-indhuvadhana-song-dance/
వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి నిలిచారని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. సీఎం పెళ్లి రోజు కానుకగా.. రైతులకోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వెల్లడించారు.



ముఖ్యమంత్రి దంపతులు నూరు వసంతాలు జరుపుకోవాలని, ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయన్నారు. వైఎస్సార్‌ అప్పట్లో ఈ ప్రాంతానికి మేలు చేశారని, మళ్లీ 15 ఏళ్లతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నారన్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల ఎకరాకు రూ.10 లక్షల రూపాయల విలువ పెరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం వచ్చిన వేళా విశేషం కారణంగా.. మంచిగా వర్షాలు పడ్డాయని, నీళ్లు అందుతున్నాయన్నారు.