Ysrcp Parliamentary : నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం (జూలై 15)న జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు.
Ysrcp Parliamentary Meeting : వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం (జూలై 15)న జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సంబంధించి పార్లమెంటులో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహాలను, లేవనెత్తాల్సిన అంశాలను, విధానాలపై చర్చించేందుకు పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. దీనికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డితోపాటు లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు.
ఉమ్మడి ప్రాజెక్ట్లను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్పైనా చర్చించుకుని, దాన్ని సభ ముందుకు తెచ్చేలా వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీపై, సీఎం జగన్ పై సంచలన విమర్శలు, అనూహ్య ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని, ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణికి నిరసనగా అవసరమైతే సభను స్తంభింపజేస్తామని కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ వర్షాకాల సమావేశాల్లోనే రఘురామపై వేటు పడేలా స్పీకర్ నిర్ణయం ఉండొచ్చనీ వైసీపీ ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు.