AP Parishat elections : ఏపీలో రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ZPTC, MPTC elections in AP : ఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఎన్నికల సామాగ్రిని వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలని, పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించాలని SEC ఆదేశించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 515 జడ్పీటీసీలు, 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతోంది.
126 జడ్పీటీసీలు, 2వేల 371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. జడ్పీటీసీ స్థానాలకోసం 2వేల 58 మంది, ఎంపీటీసీ స్థానాలకోసం 18వేల 782మంది పోటీ పడుతున్నారు. 27వేల 751 పోలింగ్ కేంద్రాల్లో 2కోట్ల 46లక్షల 71వేల 2మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. లక్ష 71వేల 44మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 6వేల 492 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇందులో 6వేల 314 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 247 పోలింగ్ కేంద్రాలున్నాయి.
అయితే పరిషత్ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఫుల్ జోష్లో ఉంది. ఇప్పటికే భారీగా ఏకగ్రీవాలను కైవసం చేసుకున్న వైసీపీ.. వీటిని కూడా క్లీన్ స్వీప్ చేస్తామనే నమ్మకంతో ఉంది. అయితే బీజేపీ, జనసేన, వామపక్షాలు మాత్రం తాము ఎన్నికల బరిలో ఉంటామని తేల్చి చెప్పాయి.
రేపటి పోలింగ్పై ఎస్ఈసీ నీలంసాహ్నీ సమీక్ష నిర్వహించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్తో ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి పోలింగ్కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్న సాహ్నీ.. పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటుచేయాలని సూచించారు.