మహారాష్ట్రలో సీబీఐకి ‘నో’ ఎంట్రీ…ఉద్దవ్ సంచలన నిర్ణయం సరైనదే

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2020 / 08:48 PM IST
మహారాష్ట్రలో సీబీఐకి ‘నో’ ఎంట్రీ…ఉద్దవ్ సంచలన నిర్ణయం సరైనదే

Maha govt withdraws general consent clause for CBI కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సాధారణ సమ్మతి(general consent)ని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఆ రాష్ట్రంలో ఏదైనా కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ అనుమతిని సీబీఐ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా జాతీయ స్థాయి కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఆయా కేసుల దర్యాప్తు చేపడుతుంది.



మరోవైపు గత కొన్ని నెలల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు తమ సమ్మతిని తెలియజేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ తన దర్యాప్తును చేపట్టేది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది.



మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదమవుతోంది. ఈ నేనథ్యంలో మహారాష్ట్రలో సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించిన కారణాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్థానిక కేసుల దర్యాప్తులో సీబీఐ అనవసరంగా జోక్యం చేసుకుంటోందని, ఇది రాష్ట్ర హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని సంజయ్ రౌత్ చెప్పారు.



జాతీయ సమస్యల విషయానికి వస్తే దర్యాప్తు చేసేందుకు ఈ సంస్థకు అధికారాలు ఉన్నాయని, కానీ ముంబై పోలీసులు ఇదివరకే ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుల్లో జోక్యం చేసుకునేందుకు సీబీఐకి అధికారం లేదని సంజయ్ రౌత్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి, మహారాష్ట్ర పోలీసులకు సొంత హక్కులంటూ ఉంటాయని,అయితే ఈ హక్కులలో సీబీఐ జోక్యం చేసుకుంటోంది గనకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంజయ్ రౌత్ వివరించారు.ఉద్దవ్ సంచలన నిర్ణయం సరైనదేనని రౌత్ తెలిపారు.



అయితే,బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తుతోపాటు తాజాగా టీఆర్పీ రేటింగ్‌ స్కామ్ పై సీబీఐ జోక్యం చేసుకోనుండటమే ప్రభుత్వ నిర్ణయానికి కారణంగా మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ తెలిపారు. రిపబ్లిక్‌ టీవీ టీఆర్పీ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే దురుద్దేశంతో ఉత్తరప్రదేశ్‌ లో కూడా దీనిపై కేసు నమోదైందని తెలిపారు. సుశాంత్‌ మరణం కేసును బీహార్‌లో నమోదు చేసిన మాదిరిగా ఈ కేసు దర్యాప్తును కూడా సీబీఐకి అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన విమర్శించారు. రాజకీయాల కోసం సీబీఐ సంస్థను వాడుకోవడం సరికాదన్నారు. అందుకే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన దర్యాప్తు సమ్మతిని తాజాగా వెనక్కి తీసుకున్నదని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కేసులకు ఇది వర్తించదని తెలిపారు.