సుజనాచౌదరితో తాడోపేడో తేల్చుకోవడానికి సోమువీర్రాజు రెడీ

  • Published By: naveen ,Published On : August 1, 2020 / 01:58 PM IST
సుజనాచౌదరితో తాడోపేడో తేల్చుకోవడానికి సోమువీర్రాజు రెడీ

ఏపీ బీజేపీ తీరు విచిత్రంగా ఉంది. ఒక నాయకుడు మాట్లాడిన దానికి మరో నాయకుడు మాట్లాడిన దానికి లింకుండదు. ఏపీ రాజధానుల విషయంలో తలో మాట మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒక నాయకుడు రాజధానుల వ్యవహారం కేంద్ర పరిధిలో లేదని, రాష్ట్రానికి సంబంధించిన అంశమేనని అంటారు. మరో నాయకుడు ఇందుకు భిన్నంగా ఇది కేంద్ర పరిధిలోని అంశమేనని… కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్తారు. చివర్లో అది తన వ్యక్తిగత అభిప్రాయం అంటారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్‌ అయ్యారు.



టీడీపీకి వంత పాడుతున్న సుజనా ప్రియ శిష్యుడికి షాక్:
బీజేపీలో ఉంటూ టీడీపీకి వంతపాడుతున్న లంకా దినకర్ సహా మరికొందరికి షాకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లంకా దినకర్ స్వయంగా సుజనా చౌదరి ప్రియ శిష్యుడు కావడంతో ఇది సుజనాకు చెక్ పెట్టే చర్యగానే రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. టీడీపీ అనుకూల చానెళ్లలో లంకా దినకర్ ఇష్టానుసారంగా టీడీపీకి వంతపాడడమే ఈ నోటీస్‌కు కారణంగా చెబుతున్నారు. ఇక సుజనా చౌదరి కూడా అమరావతి అంశంపై పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై సోము వీర్రాజు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోము వీర్రాజు భేటీ సందర్బంగా పార్టీలో ఉంటూ ధిక్కార స్వరాలను వినిపించే నేతల గురించి వివరించాలని భావిస్తున్నారట. ఈ విషయంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్టానాన్ని వీర్రాజు కోరనున్నారట.

సుజనాతో తాడో పేడో తేల్చుకోనున్న వీర్రాజు:
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని.. అసలీ వ్యవహారంతో కేంద్రానికి సంబంధమే లేదని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేస్తున్నారు. సోము వీర్రాజుకు కౌంటర్‌గా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్లులపై నిర్ణయం తీసుకోబోయేది కేంద్రమే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. సోము ప్రకటనకు విరుద్ధంగా సుజనా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సుజనా శిష్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సోము వీర్రాజు ఇప్పుడు సుజనాపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకునేందుకే రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.



అయోమయంలో కార్యకర్తలు:
మరోపక్క కొందరు నేతల తీరు మరోలా ఉంటుంది. రాష్ట్రంలో జగన్‌ డిఫెన్స్‌లో పడిన ప్రతీసారి కొందరు నేతలు ప్రత్యక్షమై.. కాస్త అనుకూలంగా మాట్లాడుతుంటారు. తమ నిర్ణయాలు ప్రకటిస్తారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు డిఫెన్స్‌లో పడినప్పుడు మరికొందరు ప్రత్యక్షమై ఆయనకు మద్దతుగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఈ రెండు వర్గాలను అదేంటి అలా అంటున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే.. రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసమే అంటారు. ఈ వ్యవహారాన్నంతా చూస్తున్న సాధారణ కార్యకర్తలు ఇదెక్కడి అయోమయం కిచిడిరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. నేతల మధ్య భిన్నాభిప్రాయాలతో కార్యకర్తల్లో గందరగోళంలో పడుతున్నారు. అసలు ఏది పార్టీ నిర్ణయమో.. ఏది వ్యక్తిగతమో తెలియక సతమతం అవుతున్నారు. మరి ఈ విషయంలో అధిష్టానం ఏదైనా ఒక స్పష్టత ఇస్తుందా లేదా అన్నది చూడాలి.