మరో పదేళ్లు కరోనా ప్రభావం, ఆ ప్రాంతాల్లో మరోసారి విజృంభించే అవకాశం, బాంబు పేల్చిన WHO

మరో పదేళ్లు కరోనా ప్రభావం, ఆ ప్రాంతాల్లో మరోసారి విజృంభించే అవకాశం, బాంబు పేల్చిన WHO

Corona Virus

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒకటి కాదు రెండు కాదు మరో పదేళ్ల పాటు కరోనా ప్రభావం ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇంకా చాలా మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.



వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా:
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్నాళ్లుగా అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. చాలామంది ఉపాధి కూడా కోల్పోయారు. నిరుపేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి ప్రభావం ఏకంగా మరో పదేళ్ల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ హెచ్చరించడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇటువంటి వ్యాధులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయి, వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుంది:
ఇటీవల కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ అత్యవసరంగా సమావేశమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ..’కరోనా మహమ్మారి ప్రభావం పదేళ్ల పాటు ఉంటుంది. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించాలి. ఇటువంటి వ్యాధులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయి. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుంది” అని ఆయన అన్నారు.



మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి వైరస్ విజృంభిస్తోందని అధ్నామ్ గుర్తుచేశారు. తొలిరోజుల్లో పెద్దగా వైరస్ ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రం వైరస్‌ను బాగా కట్టడి చేయగలిగాయన్నారు.

కోటి 70లక్షల కేసులు, 7లక్షల మరణాలు:
2019 డిసెంబర్ నెల చివరలో చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి కరోనా వైరస్ వెలుగు చూసింది. చైనాని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పటి వరకూ కోటి 70లక్షల వైరస్ బారినపడగా.. 7 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలోనే అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 47 లక్షల మందికి వైరస్ నిర్దారణ కాగా.. 1.56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ కోసం 150కిపైగా సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే 2021 తొలినాళ్లలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని గతవారం డబ్ల్యూహెచ్ఓ తెలిపిన సంగతి తెలిసిందే.



మరో పదేళ్లు కరోనా ప్రభావం ఉంటుందని, ఇంకా చాలామందికి వైరస్ ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే వచ్చి తగ్గిన ప్రాంతాల్లో మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ చేసిన హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలే ఉపాధి లేక, తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి కరోనాతో చనిపోతున్న వారికంటే ఆకలితో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.