ఆ రెండు దేశాల్లో మళ్లీ లాక్డౌన్..!
lockdown in two countries : ప్రపంచాన్ని కరోనా పట్టిపీడుస్తోంది. భారత్ సహా కొన్ని దేశాలు కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కానీ, ఆ రెండు దేశాల్లో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయాయి.. కరోనా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి.
దాంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మళ్లీ లాక్డౌన్ విధించేందుకు సన్నద్ధమ వుతున్నాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరగడంతో తాత్కాలిక లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్టు జర్మనీ ఛాన్సలర్ Angela Merkel ప్రకటించారు.
జర్మనీ డిసీజ్ కంట్రోల్ ఏజెన్సీ Robert Koch Institute ప్రకారం.. గత కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా 14,964 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 27 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా దేశంలో 4,49,275కు కరోనా కేసులు చేరగా.. మరణాల సంఖ్య 10,098కి చేరింది.
ఫ్రాన్స్లో భారీగా కరోనా మరణాలు :
ఫ్రాన్స్లో కరోనా మరణాలు పెరిగిపోతున్న క్రమంలో ఆ దేశాధ్యక్షుడు కొత్త లాక్డౌన్ విధించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు పెరగడమే కాకుండా.. ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడమే శరణ్యమంటూ ఫ్రాన్స్ అధ్యక్షులు టెలివిజన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కొత్త లాక్ డౌన్ విధించాలని ఫ్రెంచ్ డాక్టర్లంతా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో 58 శాతం ఐసీయూలు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి.
గత 24 గంటల్లో ఫ్రాన్స్ లో 523 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి కరోనా కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం.. మొత్తం మీద కరోనా మరణాల సంఖ్య 35,541కి చేరింది. బ్రిటన్, ఇటలీ తర్వాత మూడో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా యూరప్ నిలిచింది. గత కొన్నివారాలుగా రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. ప్రతివారం లక్ష మందిలో 380కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.