దుబ్బాక రగడ.. ఆ నోట్ల కట్టలు ఎవరివి? ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీఆర్ఎస్, బీజేపీ

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 11:28 AM IST
దుబ్బాక రగడ.. ఆ నోట్ల కట్టలు ఎవరివి? ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీఆర్ఎస్, బీజేపీ

dubbaka incident: తెలంగాణ పాలిటిక్స్‌లో దుబ్బాక హీట్‌ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. హైదరాబాద్‌లో బీజేపీ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రగతి భవన్‌ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దుబ్బాక ఘటనపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. అటు తాజా పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు బీజేపీ బీజేపీకి కౌంటర్‌గా దుబ్బాకలో టీఆర్ఎస్‌ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. తొగుటలో ర్యాలీ, యువజన సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు.

బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో రూ.18లక్షలు లభ్యం:
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక వేళ.. రాజకీయం వేడెక్కింది. మరికొన్ని రోజుల్లో దుబ్బాక స్థానానికి పోలింగ్ జరగాల్సి ఉంది. ఇంతలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. సోదాలు.. అరెస్టులు.. లాఠీచార్జిలతో సిద్దిపేట అట్టుడికింది. దాదాపు పది గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల నుంచి బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టు వరకూ హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం(అక్టోబర్ 26,2020) మధ్యాహ్నం.. పోలీస్‌, రెవెన్యూ అధికారులు కలిసి రఘునందన్‌రావు బంధువులు సురభి రాంగోపాల్‌రావు, సురభి అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రఘునందన్‌రావు మామ రాంగోపాల్‌రావు ఇంట్లో ఎటువంటి నగదు లభ్యం కాలేదు. కాగా, సురభి అంజన్‌రావు ఇంట్లో మాత్రం రూ.18.67 లక్షల నగదు లభ్యమైనట్లు ప్రకటించడం సంచలనం రేపింది. ఆ నగదుతో బయటకు వస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులే ఇంట్లో డబ్బులు పెట్టి.. లభ్యమైనట్లు చెబుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు.

మరోవైపు తనిఖీల విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా అక్కడికి చేరుకొని.. నోటీసులివ్వకుండా తనిఖీలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

బట్ట కాల్చి మీదేస్తున్నారు: రఘునందన్‌
దేశంలో ఎవరి ఇళ్లలో డబ్బులు దొరికినా తనకు సంబంధించినవేననడం సమంజసం కాదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. తనను వందసార్లు చెక్‌ చేశారని, ఇంకా వందసార్లు చెక్‌ చేసినా తాను ఫెయిర్‌గానే ఉన్నానని తెలిపారు. బట్ట కాల్చి మీదేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో కూడా తనిఖీలు చేసుకోవచ్చని సూచించారు. తన కూతురు, అల్లుడు ఇద్దరు డాక్టర్లేనని, వారిని కూడా పని చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు నోటీసు ఇవ్వలేదని, పైగా డబ్బులను బీజేపీ కార్యకర్తలు అపహరించారంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు సంబంధం లేని ఇంట్లో తనిఖీలు చేశారని, పోటీ చేయకుండా తప్పించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

అడ్డంగా దొరికినా డ్రామాలు చేస్తున్నారు:
బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. మద్యం, నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున్నారని మండిపడ్డారు హరీశ్‌రావు. ఓడిపోతామనే భయంతో బీజేపీ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని జనం నమ్మరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దుబ్బాకలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని హరీష్ రావు జోస్యం చెప్పారు.