సన్‌రైజర్స్ అద్భుతహః

సన్‌రైజర్స్ అద్భుతహః

ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శన అందించి విన్ రైజర్స్ అనిపించుకున్నారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్‌మన్ డివిలియర్స్ ఒంటరిపోరాటం వృథాకాగా, హైదరాబాద్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆదివారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఢీ కొట్టనుంది.

బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఒంటరిపోరాటం:
ముందుగా టాస్‌ గెలిచిన వార్నర్‌.. బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ చేసింది 6 పరుగులే. డివిలియర్స్‌ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఫించ్‌ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరవాలేదనిపించాడు. హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి.


మ్యాచ్ మొత్తంలో బెంగళూరు ఖాతాలో ఉంది 10 ఫోర్లు, 1 సిక్స్‌ మాత్రమే. పేలవ స్ట్రయిక్‌రేట్‌తో ఫించ్‌ పరుగులు చేయగా… డివిలియర్స్‌ మినహా అంతా విఫలమయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (6) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ (1)కు ఈ సారి కాలం కలిసి రాలేదు. ఈ దశలో కొద్దిసేపు ఫించ్, డివిలియర్స్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా వేగంగా పరుగులు చేయలేకపోయారు. నదీమ్‌ బౌలింగ్‌లో ఫించ్‌ అవుట్‌ కావడంతో ఈ పార్టనర్‌షిప్‌కు బ్రేక్ పడింది.

అదే ఓవర్లో ‘ఫ్రీ హిట్‌’ షాట్‌ ఆడి సింగిల్‌ కోసం ప్రయత్నించిన మొయిన్‌ అలీ (0) రనౌటయ్యాడు. మరోవైపు డివిలియర్స్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో స్కోరును నడిపించాడు. అయితే అతను కూడా తనదైన శైలిలో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడం హైదరాబాద్‌ బౌలింగ్‌ సత్తా మరోసారి రుజువు చేసింది. 39 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తి కాగా… శివమ్‌ దూబే (8), సుందర్‌ (5) కూడా తొందరగా డగౌట్‌ చేరారు. ఇన్నింగ్స్‌లో మరో 14 బంతులు మిగిలి ఉండగా… డివిలియర్స్‌ చెలరేగుతుండగా భారీ స్కోరుకు చేరుతుందనే అవకాశం కనిపించింది. నటరాజన్‌ వేసిన అద్భుత యార్కర్‌ డివిలియర్స్‌ మిడిల్‌ స్టంప్‌ను గిరాటేయడంతో బెంగళూరు సాధారణ స్కోరుకు పరిమితం కావాల్సి వచ్చింది.

అనంతరం 132 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జాసన్‌ హోల్డర్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరానికి చేర్చారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అభేద్యంగా 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం.

ఉత్కంఠను అధిగమించి…
గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రీవత్స్‌ గోస్వామి (0)తో కలిసి డేవిడ్‌ వార్నర్‌ (17) ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తొలి ఓవర్లోనే రైజర్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. మనీశ్‌ పాండే (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వార్నర్‌ కలిసి జాగ్రత్తగా ఆడుతున్న దశలో అంపైర్‌ వివాదస్పద నిర్ణయంతో వార్నర్‌ వెనుదిరిగాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌ పట్టగా, అంపైర్‌ తిరస్కరించాడు. ఆర్‌సీబీ రివ్యూ కోరింది. సుదీర్ఘ సమయం పాటు పలు రీప్లేల తర్వాత వార్నర్‌ను మూడో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు.

ఆ తర్వాత తక్కువ వ్యవధిలో పాండే, గార్గ్‌ (7) కూడా అవుట్‌ కావడంతో రైజర్స్‌ ఛేదనపై సందేహాలు రేగాయి. బెంగళూరు బౌలర్లు కూడా ఎలాంటి భారీ షాట్లకు అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా… విలియమ్సన్, హోల్డర్‌ ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించలేదు. సైనీ వేసిన చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా… మూడో, నాలుగో బంతులను బౌండరీ దాటించి హైదరాబాద్‌కు విజయం ఖాయం చేశాడు.

* ఈ టోర్నీలో రైజర్స్‌ గెలిచిన మొత్తం 8 మ్యాచ్‌ల్లో 8 వేర్వేరు ఆటగాళ్లకు (రషీద్‌ ఖాన్, ప్రియమ్‌ గార్గ్, బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, సాహా, సందీప్‌ శర్మ, నదీమ్, విలియమ్సన్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు రావడం విశేషం.

* ఈ ఐపీఎల్‌లో వార్నర్‌ టాస్‌ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్‌ టోర్నీలలో గతంలో రోహిత్‌ (ముంబై–2017), ధోని (చెనై–2016) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆ రెండు సార్లూ రోహిత్, ధోని జట్లు ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నాయి.