ఊహించని మలుపులు‌, పూటకో ట్విస్టులు.. దివ్య తేజస్విని కేసులో వీడని మిస్టరీ

  • Published By: naveen ,Published On : October 17, 2020 / 12:49 PM IST
ఊహించని మలుపులు‌, పూటకో ట్విస్టులు.. దివ్య తేజస్విని కేసులో వీడని మిస్టరీ

divya tejaswini murder case: బెజవాడ ప్రేమోన్మాదం ఘటనలో ఊహించని మలుపులు‌.. రోజులు గడిచే కొద్ది కొత్త కొత్త ట్విస్ట్‌లు. కత్తి దాడి ఘటనపై ఒక్కొక్కరిది ఒక్కో మాట. రోజులు గడుస్తున్నాయి.. కానీ మిస్టరీ వీడటం లేదు. ఎవరి వాదన వారే చెబుతుండడంతో.. దివ్య కేసులో అసలు నిజాలేంటన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది.

ప్రేమోన్మాదం ఘటనలో ఊహించని ట్విస్ట్‌లు‌.. కత్తి దాడిపై ఒక్కొక్కరిది ఒక్కో మాట.. తాజాగా వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్‌‌.. వెలుగులోకి దివ్య ఇన్‌స్టాగ్రామ్ వీడియో.. నాగేంద్ర ఓ సైకో అంటూ వీడియో చేసిన దివ్య.. ఓ మహిళ వల్ల మోసపోయానంటూ కంటతడి.. కూతురికి అసలు పెళ్లే జరగలేదన్న దివ్య తల్లి.. ఏడాది క్రితమే దివ్యకు తాళి కట్టానన్న నాగేంద్ర.. మరి ఎవరిది నిజం..? ఎవరిది అవాస్తం..? దివ్యను టార్చర్‌ పెట్టిన ఆ మహిళ ఎవరు..?

ఓ సైకోతో పోరాడుతున్నా… నా జీవితం నాశనం చేయాలని చూశాడు:
విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్‌ దివ్య తేజస్విని కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. రోజులు గడిచే కొద్ది దివ్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా దివ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చివరి సారిగా మాట్లాడిన ఓ వీడియో..ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నానని…అతను తన జీవితం నాశనం చేయాలని చూశాడని ఆ వీడియోలో చెప్పుకుంది. తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని…పోరాడాలని అనుకుంటున్నానని కంటతడి పెట్టింది. అలాగే తనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయంటూ..ఓ మహిళ వల్ల తాను మోసపోయానంటూ బాధపడింది.

పెద్దలు ఒప్పుకోవట్లేదని..చనిపోదామని దివ్యనే చెప్పింది:
ఇదిలా ఉంటే…చికిత్స పొందుతున్న నాగేంద్ర…దివ్య హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు. మూడేళ్లుగా దివ్యతో పరిచయం ఉందన్నాడు. ఏడాది క్రితమే దివ్యను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించాడు. పెళ్లి విషయం దివ్య ఇంట్లో తెలిసిన తమను విడదీశారని అన్నాడు. ఏడు నెలలుగా దివ్య తనకు దూరంగా ఉందని..అందుకే మాట్లాడేందుకు ఇంటికి వెళ్లానని చెప్పుకొచ్చాడు. పెద్దలు ఒప్పుకోవట్లేదని..చనిపోదామని దివ్యనే చెప్పిందని, అందుకే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించాడు.

గంజాయి అలవాటు ఉన్న పెయింటర్ ను ఎందుకు ప్రేమిస్తుంది:
మరోవైపు తమ బిడ్డను నాగేంద్రనే చంపాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గంజాయి అలవాటు ఉన్న నాగేంద్రను తమ బిడ్డ ఎందుకు ప్రేమిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ, పెళ్లి అంతా అబద్దమని కొట్టిపడేశారు. తేజస్విని ఎవరినీ ప్రేమించ లేదని…ప్రేమ జోలికి వెళ్లకుండా చదువుకుంటోందని.. అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదంటూ దివ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇక..హత్య చేయాలని ముందే నాగేంద్ర ప్లాన్‌ చేసుకున్నాడని ఆరోపించారు తేజస్విని తండ్రి. కిరాతకానికి ఎలా తెగబడ్డాడో వివరించాడు.

ఎవరికి వారే కత్తితో పొడుచుకుంటే, 13 కత్తిపోట్లు ఎందుకున్నాయి?
మరోవైపు నాగేంద్ర, దివ్య పెళ్లి విషయం తమకు ఘటన జరిగిన రోజే తెలిసిందన్నాడు నాగేంద్ర తమ్ముడు నాగరాజు. నాగేంద్ర ఒక వారం నుంచి డల్‌గా ఉంటున్నాడన్నారు. పెళ్లి విషయం ముందే తెలిస్తే ఇంత దారుణం జరిగేదికాదన్నాడు. అయితే…నాగేంద్ర చెబుతున్న దాంట్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సూసైడ్ చేసుకోవాలని ఇద్దరం నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాడు. అందులో భాగంగానే ఎవరికి వారే కత్తితో పొడుచుకున్నామని వివరించాడు. అదే నిజమైతే దివ్య పోస్ట్‌మార్టం నివేదికలో 13 కత్తిపోట్లు ఎందుకున్నాయన్నది అంతుపట్టడం లేదు.

ఇక…నాగేంద్రకు గంజాయి అలవాటు ఉందన్నది దివ్య పేరెంట్స్ వాదన. చెడు అలవాట్లు ఉన్న నాగేంద్ర సరైన వ్యక్తి కాదని..దివ్యకు పేరెంట్స్‌ చెప్పినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల మాట విన్న దివ్య..నాగేంద్రను దూరం పెట్టినట్టు సమాచారం. ఇది తట్టుకోలేకే నాగేంద్ర దాడి చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

తేజస్విని కేసుపై దిశ స్పెషల్‌ విభాగం ఫోకస్‌:
ఓవైపు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తుండగానే..మరోవైపు దివ్య తేజస్విని కేసుపై దిశ స్పెషల్‌ విభాగం ఫోకస్‌ పెట్టింది. దివ్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి వెళ్లిన దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌…దాడి జరిగిన తీరు, నిందితుడు నాగేంద్ర చెబుతున్న అంశాలపై ఆరా తీశారు. అలాగే దివ్య కుటుంబసభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్ముందు ఈ కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తాయో చూడాలి.