శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి…జెన్కో అధికారిక ప్రకటన

  • Published By: bheemraj ,Published On : August 21, 2020 / 05:44 PM IST
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి…జెన్కో అధికారిక ప్రకటన

శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్లాంట్ ను కాపాడారని జెన్కో పేర్కొంది. దట్టమైన పొగ వల్ల సిబ్బంది బయటకు రాలేకపోయారని చెప్పింది.

ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్…మిగిలిన మూడు మృతదేహాలను మూడో ఫ్లోర్ లో గుర్తించారు. కాబట్టి జెన్కో అధికారిక ప్రకటన వెలువడింది. మృతదేహాలన్నింటినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన కోసం కుటుంబీకులు చాలా ఎదురుచూశారు. తమ వాళ్లు ప్రాణాలతో ఉన్నారా అని ఆసక్తికరంగా ఎదురుచూసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 18 గంటలు నిరీక్షించారు. తమ వాళ్లు ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకున్నారు.

అయితే చివరి వరకు మంటలను కంట్రోల్ చేసే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. మంటలను పూర్తిస్థాయిలో కంట్రోలో చేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లదని దృష్టిలో పెట్టుకుని పని చేసినట్లు తెలుస్తోంది. కానీ వారి ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని గమనించలేకపోయారు. డీఈ, ఏఈతోపాటు మిగిలిన సిబ్బంది కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

పరిస్థితి చేజారిపోయి మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టడంతో వారు బయటికి రాలేక ఇబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది అధికారులు ఒక్కసారిగా ప్రాణాలను కోల్పోవడం, పెద్ద ఎత్తున నష్టం వాటిల్లకుండా వారు చేసిన సాహాసం చేయడంతో వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. తొలుత ప్యానెల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జల విద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి.

సిబ్బందిలో కొంతమంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా 9 మంది లోపలే చిక్కుకుపోయారు. తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత మరో ఎనిమిది మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది.

భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.