వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ తీపి కబురు, ఇకపై స్కేల్ ఉద్యోగులుగా గుర్తింపు
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, వీఆర్ఏలకు తీపి కబురు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
వీఆర్ఏలను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ చెప్పారు. వారి అర్హతలను బట్టి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో వీఆర్వోలను భర్తీ చేస్తామన్నారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గత మూడేళ్ల నుంచి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు.
https://10tv.in/no-plan-for-national-party-cm-kcr-sensational-statements-in-trslp-meeting/
బుధవారం(సెప్టెంబర్ 9,2020) అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో రెవెన్యూ బిల్లు పెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. ఈ బిల్లు కోసం మూడేళ్లుగా కసరత్తు చేశాం. భూ రికార్డుల ప్రక్షాళనతో కొంత ఫలితం వచ్చింది. మా బాధ్యతగా రెవెన్యూ అధికారులతో చర్చించాం. ఏ చట్టం తెచ్చినా గౌరవిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ చట్టం ఫలితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ చట్టంతో ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదు. వీఆర్వోలను స్కేల్ ఎంప్లాయిస్గా మార్చుతాం. రెవెన్యూ బాగు చేసేందుకు ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నా. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం రోజు సమగ్ర చర్చ’ జరుగుతుందని కేసీఆర్ తెలిపారు.
త్వరలో అందుబాటులోకి ధరణి పోర్టల్:
‘త్వరలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ధరణి పోర్టల్లో అన్ని వివరాలు ఉంటాయి. ధరణి పోర్టల్ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ వివరాలు ధరణిలో ఉంటాయి. ఈ పోర్టల్తో రైతులకు మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర భూభాగం 2.75కోట్ల ఎకరాలు. ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలనైనా ధరణిని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ధరణి పోర్టలే అన్నింటికీ ఆయువు పట్టు. కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవు. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తాం. ఇకపై ఎవరూ పక్కవారి భూమిపై కన్నేయొద్దు. ఇకపై ఇంచు భూమి కూడా ఆక్రమించుకోలేరు. వ్యవసాయ భూములనే ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్ చేస్తారు. నాన్ అగ్రికల్చర్ భూములను సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేస్తారు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.