తెలంగాణలో అమెజాన్ 1.6 బిలియన్ల పెట్టుబడులు 

  • Published By: chvmurthy ,Published On : February 10, 2020 / 02:54 PM IST
తెలంగాణలో అమెజాన్ 1.6 బిలియన్ల పెట్టుబడులు 

అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను  నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో  90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాల పైనే పెట్టనుంది. ఇవి రెండు తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్(Amazon Web Services) అభివృద్ధికి సాయం చేయనున్నాయి. 
 

హైదరాబాద్ శివార్లలో  డేటా సెంటర్ల నిర్మించేందుకు అమెజానా డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (ADSIPL) పర్యావరణ అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.  గత నెల 31న నిపుణల కమిటీ (ఎస్‌ఈఏసీ)కి  అవసరమైన పత్రాలు  Amazon అందజేసింది. ఈ పత్రాల ప్రకారం చందన్‌వల్లిలో 66,003 చదరపు మీటర్లు, మీర్‌ఖాన్‌పేటలో 82,833 చదరపు మీటర్ల విస్తీర్ణంలో  అమేజాన్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతం హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంది. 
 

ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్, 2006 ప్రకారం, 20,000 చదరపు మీటర్ల మించిన విస్తీర్ణంతో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే అందుకు పర్యావరణ క్లియరెన్స్ పొందడం తప్పనిసరి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఓ పెద్ద కార్పోరేట్ ఆఫీస్ కలిగిన అమెజాన్ సంస్థ, అందుకు దగ్గరగా తమ డేటా సెంటర్లను హైదరాబాద్ శివారుల్లోనే ఏర్పాటు చేసేందుకు ముందడగు వేసింది.  
 

దేశంలో స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా మరియు IOT సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ సంస్థలు దేశంలో భారత మార్కెట్ ను ఒడిసిపట్టేందుకు పోటీపడుతున్నాయి. 
 

2024 నాటికి భారత్ లో డిజిటల్ మార్కెట్ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.  కాగా, అమెజాన్ సంస్థ ప్రతిపాదనలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల విభాగం, ఆ రెండు ప్రదేశాలతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రవిర్యాల వద్ద భూమిని కేటాయించేందుకు నిర్ణయించింది.