Jet Airways Plan : ఆర్థిక సంక్షోభంతో మూతబడ్డ దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ (Jet Airways Plan)కు లైన్ క్లియర్ అయింది. కమర్షియల్ విమాన సర్వీసులు నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతించింది. 2019 ఏప్రిల్ 17న జెట్ ఎయిర్ వేస్ చివరి విమానం నడిచింది. ఆ తర్వాత జెట్ ఎయిర్వేస్ సంస్థను మూసేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత జెట్ ఎయిర్ వేస్ కు రెక్కలు వచ్చాయి. మొదటి విమానం ఇప్పుడు గాల్లోకి ఎగిరింది. మే 5న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టెస్ట్ ఫ్లైట్ను నడిపింది జెట్ ఎయిర్వేస్.
కమర్షియల్ సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని కంపెనీ సీఈఓ సంజీవ్ కపూర్ ప్రకటించారు. మూడేళ్ల తర్వాత సర్వీసులు ప్రారంభం కావడంపై జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. జెట్ ఎయిర్ వేస్ పూర్తిగా నష్టాల్లోకి జారుకుంది.. 2019లో జెట్ ఎయిర్ వేస్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆర్థిక సాయం కూడా అందే పరిస్థితి లేకపోవడంతో.. జెట్ ఎయిర్వేస్ మూసివేయాలనే ప్రతిపాదన వచ్చింది. చివరికి మేనేజ్మెంట్ కూడా చేతులెత్తేసింది. 2019 ఏప్రిల్లో సంస్థ మూతబడే ముందు 3 వేల 500 కోట్ల అప్పులు ఉన్నాయి.
ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడంతో మరో 3 వేల 500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇతరేతర అప్పులతో కలిపి మొత్తం 8 వేల 500 కోట్ల అప్పులు తేలాయి. దాంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 16, 500 మంది జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. సంస్థ మూతబడ్డ ఏడాదన్నర తర్వాత 2020 అక్టోబర్లో బ్రిటన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ బిజినెస్ టైకూన్ జలాన్ల నేతృత్వంలోని కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసింది. బ్యాంకులు, ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన రూ.12వేల కోట్లు కన్సార్టియం చెల్లించి జెట్ ఎయిర్ వేస్ను సొంతం చేసుకుంది.
Read Also : Jet Airways : మళ్లీ గాల్లో ఎగరనున్న జెట్ ఎయిర్ వేస్