ఇంకెక్కడి ప్రైవసీ : మళ్లీ ఫేస్బుక్, ట్విట్టర్ యూజర్ల డేటా బహిర్గతం
సోషల్ మీడియా యూజర్ల డేటా మరోసారి ఉల్లంఘనకు గురైంది. ప్రముఖ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లలో వందలాది మంది యూజర్ల డేటా బహిర్గతమైనట్టు ఓ రిపోర్టు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ యాప్ నుంచి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లాగిన్ కావడం ద్వారా యూజర్ల డేటాను కొందరు ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్ యాక్సస్ అయినట్టు సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు.
ఇందులో ఎక్కువగా వన్ ఆడియోన్స్, మోబిబర్న్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కిట్స్ (SDK) ద్వారా రెండు ప్లాట్ ఫాంలపై యూజర్ల ఈమెయిల్స్ అడ్రస్, యూజర్ నేమ్స్, రీసెంట్ ట్వీట్లతో సహా యూజర్ల డేటాను యాక్సస్ చేసుకునేందుకు అనుమతించినట్టు తెలిపింది.
ఎంతమంది యూజర్ల డేటా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బహిర్గతం అయ్యాయో ట్విట్టర్, ఫేస్బుక్ త్వరలో నోటిఫై చేస్తామని తెలిపాయి. ‘వన్ ఆడియోన్స్ ద్వారా మలాసియస్ మొబైల్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కిట్ (SDK) రన్ చేస్తున్నట్టు గుర్తించాం. ట్విట్టర్ అకౌంట్ యూజర్ల వ్యక్తిగత సమాచారంపై ప్రభావం చూపే ఇలాంటి చర్యలను తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటివరకూ ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే ఐఓఎస్ యూజర్లపై ఎలాంటి ప్రభావం పడలేదని తెలిపింది. తమ ప్లాట్ ఫాంపై నిబంధనలను ఉల్లంఘించే థర్డ్ పార్టీ యాప్స్ పై సమీక్షలు జరిపామని, అనుమానిత యాప్స్ తొలగించినట్టు స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లలో డేటాపై మాత్రమే ప్రభావం ఉందని ట్విట్టర్ తెలిపింది.