అపర కుబేరుల Jio-Facebook డీల్ ముచ్చట్లు.. ముఖేశ్ అంబానీతో జుకర్‌బర్గ్ ఏమన్నారంటే?

అపర కుబేరుల Jio-Facebook డీల్ ముచ్చట్లు.. ముఖేశ్ అంబానీతో జుకర్‌బర్గ్ ఏమన్నారంటే?

Jio-Facebook Partnership Deal : ఇద్దరు అపర కుబేరులు ఒకరినొకరు మాట్లాడుకుంటే చూసేందుకు ప్రపంచమంతా ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడా ఆ తరుణం రానే వచ్చింది. ‘ఫేస్ బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా’ కార్యక్రమం అందుకు వేదికగా మారింది. ఇండియాలో ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్, టెలికం దిగ్గజం రిలయన్స్ జియో భాగస్వామ్యం గురించి ప్రపంచానికి తెలిసిందే.

రెండు కంపెనీల మధ్య మల్టీ మిలియన్ల డాలర్ల డీల్ కుదుర్చుకునే క్రమంలో ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేశ్ అంబానీ వాట్సాప్, జియోమార్ట్‌ల భాగస్వామ్యంపై  ఒకరినొకరు ప్రశ్నలు సంధించుకున్నారు.

40 నిమిషాల పాటు ఇద్దరు దిగ్గజాల మధ్య సంభాషణ కొనసాగింది. భారతదేశంలో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం ఎంతో ముఖ్యమని మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. వాట్సాప్‌లో భారతదేశం నుంచి 15 మిలియన్ల బిజినెస్ యాప్ యూజర్లు ఉన్నారని ఆయన తెలిపారు. చిన్న వ్యాపారాల కోసం బెస్ట్ టూల్స్ నిర్మించడంపై తమ కంపెనీ దృష్టి సారించిందని జుకర్ బర్గ్ వెల్లడించారు. జియో ప్లాట్‌ఫామ్‌ల భాగస్వామ్యం అనేది గొప్ప అవకాశమన్నారు.

భారతదేశంలో మిలియన్ల చిన్న వ్యాపారాలకు సపోర్టు చేయడంలో ఇరువరి భాగస్వామ్యం కీలకంగా మారుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆఫ్ లైన్ మార్కెట్ నుంచి డిజిటల్ మార్కెట్ కు మారేందుకు ఫేస్ బుక్-జియో భాగస్వామ్యం  దోహదం చేస్తుందని ఫేస్ బుక్ సీఈఓ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ముందే భారతదేశంలో తమ కొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తున్నామని వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను రూ.43,574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు)కు ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. భారతదేశంలో మైనారిటీ పెట్టుబడులకు అతిపెద్ద FDIకూడా. వాట్సాప్‌లో జియో-ఫేస్‌బుక్ భాగస్వామ్యం గురించి ‘జియో మార్ట్’ సర్వీసులో కీలక పాత్ర గురించి అంబానీ సంభాషించారు.

జియో, వాట్సాప్ రెండూ భారతదేశంలో 400 మిలియన్లకు పైగా కస్టమర్లను కలిగి ఉన్నాయి. రిటైల్ సర్వీసుల్లో జియో మార్ట్, భారతదేశంలో కోట్లాది మంది చిన్న షాపు యజమానులకు సర్వీసు అందిస్తోంది. జియో డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్ ఇప్పుడు వాట్సాప్ పేతో డిజిటల్ ఇంటరాక్టివిటీని తీసుకొస్తోంది. జియో మార్ట్ ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ రిటైల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. భారతదేశంలోని గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉన్న చిన్న షాపులకు కూడా డిజిటలైజ్ చేయడానికి అవకాశాన్ని అందిస్తుందని’ అంబానీ స్పష్టం చేశారు.

జియోలో ఫేస్ బుక్ పెట్టుబడికి భారతదేశంలో FDI పెట్టుబడుల కోసం బాల్ రోలింగ్ సెట్ చేసిందని అంబానీ పేర్కొన్నారు. రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం చిన్న భారతీయ వ్యాపారాలకు రాబోయే నెలలు, సంవత్సరాల్లో అభివృద్ధికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు.

అలాగే ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI)ను కూడా జుకర్‌బర్గ్ ప్రశంసించారు. కొంతకాలంగా రెగ్యులేటరీ ఆమోదం పొందడంలో ఇబ్బందుల తర్వాత వాట్సాప్ ఇటీవలే భారతదేశంలో పేమెంట్లను ప్రారంభించింది.