ఏటీఎం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది.. డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఉపయోంచే మిషన్ అని. అయితే, అదే ఏటీఎం నుంచి ఇకపై బంగారం కూడా విత్ డ్రా చేసుకోవచ్చని తెలుసా. అదీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం నుంచి గోల్డ్ తీసుకోవచ్చు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజం. గోల్డ్ ఏటీఎం కూడా వచ్చేసింది. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది.
దేశంలోనే మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం.. హైదరాబాద్ లో ప్రారంభమైంది. బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్ లో గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. అర గ్రాము నుంచి వంద గ్రాముల వరకు బంగారం(గోల్డ్ కాయిన్స్) తీసుకునే వెసులుబాటు ఉంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు సంస్థ జారీ చేసే ప్రి పెయిడ్ కార్డులను గోల్డ్ తీసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఒక్కో మెషీన్ లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల బంగారాన్ని లోడ్ చేయవచ్చు. రానున్న రోజుల్లో హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లోనూ గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామంటోంది గోల్డ్ సిక్కా సంస్థ.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చన్నారు గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చన్నా రు. ఒక్కో మిషన్లో ఒకేసారి రెండున్నర కోట్ల రూపాయల విలువైన 5 కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని ఆయన తెలిపారు.
త్వరలోనే ఎయిర్పోర్ట్, ఓల్డ్ సిటీలో మూడు ఏటీఎంలు.. సికింద్రాబాద్, అబిడ్స్లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లలో కూడా గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3వేల యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు.
దేశంలోని తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. డెవలప్ అవుతున్న టెక్నాలజీకి.. ఈ గోల్డ్ ఏటీఎం నిదర్శనం అన్నారామె. పసిడి తీసుకునేందుకు దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను నగరంలో ప్రారంభించడాన్ని మంత్రి అభినందించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోరారు.
ఈ గోల్డ్ ఏటీఎం నుంచి బంగారం విత్ డ్రా చేసుకున్న తర్వాత నాణ్యత, గ్యారెంటీకి సంబంధించిన స్లిప్పులు కూడా ఏటీఎం నుంచి వస్తాయి. అలాగే బంగారం ధరలను కూడా ఈ ఏటీఎం స్క్రీన్పై చూసుకోవచ్చు. ఏ రోజు ఎంత ధర ఉందనే వివరాలను అప్డేట్ చేయనున్నారు. ఈ ఏటీఎంల ద్వారా బంగారం కొనుగోలు చేయడం చాలా సులువు అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.