భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని మూసేస్తున్న హార్లే-డేవిడ్‌సన్

  • Published By: vamsi ,Published On : September 25, 2020 / 06:53 AM IST
భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని మూసేస్తున్న హార్లే-డేవిడ్‌సన్

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వ్యాపార యూనిట్లు మొత్తాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా మోటారుసైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో భాగంగా, బావాల్ (హర్యానా) లోని తన తయారీ కేంద్రాన్ని మూసివేయాలని, గుర్గావ్‌లోని తన అమ్మకపు కార్యాలయ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు బైక్ తయారీదారు సంస్థ ఒక ప్రకటన చేసింది.




అయితే భారతదేశంలోని తన వినియోగదారుల కోసం మోటార్ సైకిల్ సర్వీస్ సెంటర్లను మాత్రం భారత్‌లో నడపనుంది. భవిష్యత్ కార్యకలాపాల నేపథ్యంలో వారికి సమాచారాన్ని అందించింది. కాంట్రాక్ట్ వ్యవధిలో కంపెనీ డీలర్ నెట్‌వర్క్ వినియోగదారులకు సేవలను కొనసాగిస్తుందని హార్లే డేవిడ్సన్ ప్రతినిధులు చెప్పారు. కంపెనీ భారతదేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మారుస్తోందని, తన వినియోగదారులకు సర్వీస్ కొనసాగించడానికి ఏం చెయ్యాలి అనేదానిపై అంచనాలను వేస్తున్నట్లు ప్రకటించింది.

కంపెనీ తన వ్యాపారాన్ని దేశంలో నడపడానికి ఏదైనా భాగస్వామితో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థ బావాల్ (హర్యానా) లోని తన తయారీ కేంద్రాన్ని మూసివేయడంతో సుమారు 70 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. 2020 సెప్టెంబర్ 23 నుంచి వచ్చే 12 నెలల్లో ఆమోదించబడిన పునర్నిర్మాణ కార్యకలాపాలు పూర్తవుతాయని కంపెనీ చెబుతుంది. హార్లే డేవిడ్సన్‍‌లో పోర్ట్‌ఫోలియోలో స్ట్రీట్ 750, ఐరన్ 883 వంటి మరికొన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి.




భారతదేశంలో తన కార్యకలాపాలను ఆపివేసిన మూడవ అమెరికన్ ఆటో కంపెనీ హార్లే. 2017 లో, అమెరికన్ కార్ల సంస్థ జనరల్ మోటార్స్ భారతదేశంలో తన వ్యాపారాన్ని మూసివేసి, గుజరాత్‌లోని తన ప్లాంటును విక్రయించింది. గత సంవత్సరం, ఫోర్డ్ తన ఆస్తులను మహీంద్రా & మహీంద్రాకు జాయింట్ వెంచర్‌కు బదిలీ చేసింది.




పదేళ్లలో 27,000 బైక్‌ల అమ్మకం:
ప్రీమియం విభాగంలో హార్లే బైక్‌లు భారతదేశంలో అమ్ముడుపోతూ ఉండగా.. ఎప్పటికప్పుడు తగ్గుతున్న డిమాండ్ కారణంగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలని కంపెనీ నిర్ణయించింది. హార్లే డేవిడ్సన్ దశాబ్దం క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ ఇప్పటివరకు 27,000 బైక్‌లను మాత్రమే విక్రయించింది.