Maruti Cars Prices : కొత్త మారుతి కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయతే ఇప్పుడే కొనేసుకోండి. త్వరలో మారుతీ కార్ల మోడల్ ధరలు అమాంతం పెరగనున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి (Maruti Suzuki India) అధిక ధరల ఒత్తిడి కారణంగా తమ కార్ల ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. మారుతి కంపెనీ ఇప్పటికీ ధరల పెరుగుదలపై ప్రణాళికలు రచిస్తోంది.
మోడల్ను బట్టి ధరలను పెంచే అవకాశం ఉంది. దేశంలో ఆల్టో, ఈకో, వ్యాగన్R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఎర్టిగా, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి అత్యంత పాపులర్ కార్లను కంపెనీ విక్రయిస్తోంది. FY23లో మారుతీ రెండు ధరలను పెంచింది. జనవరిలో 1.1 శాతం పెంచిన కంపెనీ.. ఏప్రిల్లో 1.3శాతం ధరలను పెంచాలని భావిస్తోంది.
Read Also : Maruti Suzuki Brezza : మారుతి సుజుకి బ్రెజ్జా CNG మోడల్ కారు లాంచ్.. భారత్లో ధర ఎంతో తెలుసా?
రెగ్యులేటరీ ఫైలింగ్లో.. మొత్తం ద్రవ్యోల్బణంతో పాటు రెగ్యులేటరీ అవసరాలతో పెరిగిన వ్యయాన్ని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఖర్చును తగ్గించడానికి, పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేసేందుకు కార్ల ధరలను పెంచాలని భావిస్తోంది. ధరల పెరుగుదలతో కొంతవరకు ప్రభావాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నట్టు మారుతీ సుజుకి ఇండియా తెలిపింది.
ఈ ధరల పెరుగుదలను ఏప్రిల్ 2023లో పెంచాలని ప్రకటించింది. అయితే కారు మోడళ్లను బట్టి ధర పెరుగుదల మారుతుందని కంపెనీ తెలిపింది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే అనేక వాహన తయారీదారులు తమ వాహనాల ధరలను పెంచాలని భావిస్తున్నారు.
కియా ఇండియా (Kia India) ఇటీవల తన RDE-కంప్లైంట్ వెహికల్ లైన్-అప్ను, సెల్టోస్, సోనెట్, కారెన్స్లను కొత్త ధరలతో ప్రారంభించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) కూడా RDE-కంప్లైంట్ ఇంజిన్లతో మోడల్లను ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను ఏప్రిల్ 1 నుంచి 5శాతం వరకు పెంచనుంది. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎంపిక చేసిన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి దాదాపు 2శాతం పెంచనుంది.