అపరకుబేరుడు, అంబానీయే నెంబర్ వన్
Mukesh Ambani : వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత సంపన్నులైన 100 మంది జాబితాను విడుదల చేసింది.
కరోనా కారణంగా ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. భారత కుబేరులు మాత్రం తమ సంపదని రక్షించుకున్నారని.. ఆ వంద మంది సంపన్నుల సంపద విలువ 14 శాతం పెరిగి 517.5 బిలియన్ డాలర్లుగా నమోదైందని ఫోర్బ్స్ పేర్కొంది.
ఈ జాబితాలో వరుసగా 13వ సారి ముకేశ్ అగ్రస్థానంలో నిలిచారని ఫోర్బ్స్ తెలిపింది. ముకేశ్ సంపదకు 37.3 బిలియన్ డాలర్లు అదనమై మొత్తం 88.7బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ జియోలోకి, ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోకి పెట్టుబడులను సమీకరిస్తుండటంతో .. అంబానీ ఆస్తి అంతకంతకూ పెరిగింది.
ఈ ఏడాదికి సంబంధించి వంద మంది భారత కుబేరుల జాబితాలలో వెనకున్న కొంతమంది ముందుకు రాగా.. మరికొంతమంది వెనక్కు వెళ్లారు. జాబితాలోకి కొత్తగా కొంతమంది చేరారు. ఈ ఏడాది టాప్ 10 జాబితాలో పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ సైరస్ పూనావాలా కొత్తగా చోటు సాధించారు.
రెండో స్థానంలో గౌతం అదానీ, మూడో స్థానంలో శివ్ నాడార్, నాలుగో స్థానంలో రాధాకృష్ణ ధమానీ, ఐదో స్థానంలో హిందూజా సోదరులు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు.