ఆర్ధిక మాంద్యమా….ప్యాంట్లు..కోట్లు కొంటున్నారుగా..బీజేపీ ఎంపీ
దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇక్కడకు కుర్తా, ధోతి ధరించి వచ్చే వాడిని..కోట్లు వేసుకుని రాలేను కదా అని వ్యాఖ్యానించారు. ఆర్ధిక మాంద్యం ఉంటే బట్టలు కొనుగోలు చేయలేము కదా అని ఆయన అన్నారు. ప్రపపంచమంతా మాంద్యంపై చర్చ జరుగుతోందే తప్ప దేశంలో అలాంటి పరిస్ధితులు లేవని ఆయన చెప్పారు.
భారతదేశంలో ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కొల్ కతా లాంటి మెట్రోనగరాలే కాదని…. ఆరున్నర లక్షల గ్రామాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. దేశంలో బ్యాంకుల్లో జమ చేసే ఎక్కువ డబ్బు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోందని బ్యాంకు లెక్కలు చెపుతున్నాయని ఆయన వివరించారు. మహాత్మా గాంధీ, హెడ్గేవార్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, జయప్రకాష్ నారాయణ్ వంటి వారు గ్రామస్తులపై విశ్వాసం ఉంచి దేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గోన్నారని ఆయన అన్నారు.
గ్రామీణులు త్యాగాలు చేయకపోయి ఉంటే మొఘల్, బ్రిటీషు వారి చెరనుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొంది ఉండేది కాదని ఆయన అన్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ తిరోగమన దిశలో లేదని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ గతవారం పార్లమెంట్ లో ప్రకటించారు.