ప్లాట్ ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంపు
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీ రూ.20 కి పెంచారు. సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తాత్కాలికంగా చార్జీలను పెంచినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగ సమయంలో రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, ఇతరుల రద్దీని తగ్గించేందుకే చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు స్పష్టం చేశారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లుకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలుమార్గాల్లో అదనంగా రైళ్లను నడుపుతోంది.