ఓలాలో రతన్ టాటా పెట్టుబడులు
దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో గతంలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. అయితే ఆయన ఎంత పెట్టుబడులు పెట్టిందీ ఓలా యాజమాన్యం ప్రకటించలేదు. సంస్థలో విద్యుత్ వాహనాల విభాగానికి సంబంధించి ఇప్పటికే టైగర్ గ్లోబల్, మాట్రిక్స్ ఇండియా వంటి సంస్థలు వాటాదార్లుగా కొనసాగుతున్నాయి. వీటన్నిటి వల్ల ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కు రూ.400 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి.ఈ సందర్భంగా 2021కల్లా దేశంలో 10 లక్షల ఈ-క్యాబ్ లను ప్రవేశపెట్టాలనే సంస్థ లక్ష్యానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపకరిస్తాయని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
రతన్ టాటా ఓలాలో పెట్టబడులు పెట్టడంఎంతో సంతోషంగా ఉందని, ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని భవిష్ అన్నారు. ప్రపంచంలోని అన్ని తరగతుల వారూ భరించగలిగేలా రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ టార్టెట్ అని ఆయన తెలిపారు. 2021 కల్లా 10 లక్షల విద్యుత్ వాహనాలను తీసుకొస్తామ’ని అన్నారు.
భవిష్ వ్యాఖ్యలపై స్పందించిన రతన్ టాటా… ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన విధానాలు ఎంతో బాగుంటాయి. ఆయన దృష్టి ఎప్పుడూ లక్ష్యం వైపే ఉంటుంది. ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో మరెన్నో మైలురాయిలను దాటుకుంటూ వెళ్లగలమని తెలిపారు.