జైలుకెళ్లను బిడ్డో : ఒకేసారి రూ.462 కోట్లు కట్టిన అంబానీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 01:57 PM IST
జైలుకెళ్లను బిడ్డో : ఒకేసారి రూ.462 కోట్లు కట్టిన అంబానీ

ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ సోమవారం(మార్చి-18,2019) చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎరికన్స్ తరపు అడ్వకేట్ అనిల్ ఖేర్ తెలిపారు. ఇంతకుముందే రూ.118 కోట్లను ఆర్.కామ్ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసింది. దీంతో ఎరిక్సన్ కి బాకీ ఉన్న మొత్తం రూ.580కోట్లను ఆర్ కామ్ చెల్లించినట్లయింది. సోమవారం బీఎస్ఈలో ఆర్.కామ్ షేర్లు 9.3 శాతం పడిపోయి రూ.4దగ్గర కొనసాగుతోంది.
Read Also : టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్

తమకు చెల్లించాల్సిన బకాయిలను ఆర్ కామ్ చెల్లించలేదంటూ 2018లో ఎరిక్సన్ కోర్టుని ఆశ్రయించింది. అక్టోబర్-23, 2018న సుప్రీంకోర్టు ఎరిక్సన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. డిసెంబర్-15, 2018లోగా ఎరికన్స్ కు బకాయిలు చెల్లించాలని ఆర్.కామ్ ను కోర్టు ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకి పంపాలని, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ మరోసారి సుప్రీంని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి-20, 2018న అనీల్ అంబానీని దోషిగా తేల్చింది.

నాలుగువారాల్లోగా ఎరిక్సన్ కు రూ.453 కోట్లు బాకీ చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధించిన నాలుగువారాల గడువు మంగళవారం(మార్చి-18,2019) ముగియనుంది. అయితే ఎరిక్సన్ కు సోమవారం బాకీ డబ్బులు చెల్లించడంతో జైలుకెళ్లే పరిస్థితి నుంచి అంబానీ బయటపడ్డారు.  
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు