పెరగనున్న సెల్ ఫోన్ కాల్, డేటా ఛార్జీలు

  • Published By: chvmurthy ,Published On : February 19, 2020 / 02:25 AM IST
పెరగనున్న సెల్ ఫోన్ కాల్, డేటా ఛార్జీలు

సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది.  దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన  ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇంక  జాగ్రత్తగా సెల్ ఫోన్ వాడే రోజులు రాబోతున్నాయి.  కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలకు చార్జీలు పెంచడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. 

ఒకవైపు 4జీ నెట్‌వర్క్‌ విస్తరణపై భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి..మరోవైపు జియోకు వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇంకోవైపు కేంద్రానికి భారీ బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితిని టెలికం కంపెనీలు ఎదుర్కోంటున్నాయి. అందుకే గత డిసెంబర్‌లో ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేసిన సంస్థలు.. తాజా పరిణామాల నేపథ్యంలో  వచ్చే ఏడాది కాలంలో తమ టారిఫ్ రేట్లను మరింత పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. 
 

టెలికం మార్కెట్ లోకి  Jio రాకపూర్వం ఒక జీబీ డేటా వినియోగానికి రూ.200కుపైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. మోస్తరు కాల్స్‌ చేసుకునే వారు కూడా నెలకు రూ.200 వరకు వెచ్చించే వారు. కానీ, 2016లో జియో అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఉచితంగా ఆరంభించిన జియో భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. డేటా, కాల్స్‌ను పరిమితి లేకుండా ఉచితంగా అందించి   సెల్ ఫోన్ వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది.  
 

జియో దెబ్బకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా డొకొమో, టెలినార్‌ లాంటి కంపెనీలు తమ వ్యాపారాలు మూసుకోవాల్సి వచ్చింది. ప్రారంభించిన మూడేళ్లలోనే కోట్లాది మంది చందా దారులను సొంతం చేసుకుని టెలికం మార్కెట్ లో Jio నంబర్‌ 1 స్థానానికి చేరుకుంది. జియో సృష్టించిన ప్రకంపనలు తట్టుకోలేక ప్రధాన టెలికం ప్లేయర్లు Vodafone India, Idea సెల్యులర్‌ విలీనమైన వొడాఫోన్‌ Idea గా అవతరించాయి. చివరకు మూడు ప్రైవేటు సంస్థలు Jio, Airtel, Vodafone India టెలికం మార్కెట్లో మిగిలాయి.  
 

ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు ఇప్పుడు కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టెలికం కంపెనీలు చార్జీలు పెంచక తప్పని పరిస్ధితి నెలకొంది. ఎయిర్‌టెల్‌ రూ.35వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.53 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.  చార్జీలు పెంచితే రాగల ఏడాది కాలంలో సగటు వినియోగదారు నుంచి వచ్చే నెలవారీ ఆదాయం (ఏఆర్‌పీయూ) రెట్టింపు కావచ్చని టెలికం కంపెనీలు అంచనాలు వేసుకుంటున్నాయి. 
 

టెలికం కంపెనీలు లాభాల్లోకి రావాలంటే పెంచాల్సిందే.. 
2019 మార్చి నాటికి ఏఆర్‌పీయూ రూ.113 స్థాయిలో ఉంది. దీనిపై కంపెనీలకు 18 శాతం నష్టాలు వచ్చాయి. ఏఆర్‌పీయూ 77 శాతం పెరిగి రూ.200కు చేరుకుంటే అప్పుడు కంపెనీలు లాభాల్లోకి ప్రవేశిస్తాయి. ఆదాయంలో లాభాలు 10 శాతానికి చేరుకుంటాయని కంపెనీల అంచనా వేస్తున్నాయి.  ‘‘2020 చివరికి ఏఆర్‌పీయూ నెలకు కనీసం రూ.200 స్థాయికి, 2021 నాటికి కనీసం రూ.300కు చేరాల్సి ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చాం. టారిఫ్‌ల పెంపు వినియోగాన్ని తగ్గించొచ్చేమో కానీ, సంఖ్యపై ప్రభావం చూపించదు’’ అని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు. 
 

ఇక ఏఆర్‌పీయూ రూ.300కు చేరుకుంటే కంపెనీల ఆదాయంలో పన్ను అనంతరం లాభాలు 30–40 శాతానికి పెరుగుతాయి. అయితే టెలికం నెట్‌వర్క్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నందున వాస్తవ లాభాలు తక్కువగానే ఉంటాయన్నది విశ్లేషణ. వచ్చే పలు త్రైమాసికాల్లో ఏఆర్‌పీయూ రూ.200కు, ఆ తర్వాత కొంత కాలానికి రూ.300కు  చేరుకుంటుందని భారతీ ఎయిర్‌టెల్‌ విశ్లేషకులకు ఇప్పటికే తెలియజేయడం గమనార్హం. ముఖ్యంగా ఏజీఆర్‌ బకాయిలు చెల్లించే భారాన్ని  టెలికం కంపెనీలు తమ వినియోగదారులకు బదిలీ చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, మార్కెట్లోకి లేటుగా వచ్చిన జియోకు ఈ ఏజీఆర్‌ భారం ఏమీ లేకపోవడంతో.. టారిఫ్‌ల పెంపు రూపంలో ఆ సంస్థకు లాభాల పంటం పండనుంది.

సాయం అందకపోతే ఐడియా మూతే..
వొడా–ఐడియా ఒక్కో త్రైమాసికంలో రూ.6వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంటోంది. గతస డిసెంబర్ లో  చార్జీలు పెంచినప్పటికీ దానివల్ల సంస్థకు  పెద్దదా కలసి రాలేదు. పైగా కేంద్రానికి రూ.53 వేల కోట్ల వరకు కట్టాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉపశమనం రాకపోతే సంస్థను మూసేయక తప్పదని కుమారమంగళం బిర్లా బహిరంగంగానే  చెప్పారు.  

ఒకవేళవొడా–ఐడియా తన వ్యాపారాన్ని మూసివేస్తే, వోడా-ఐడియా  కున్న సుమారు 30 కోట్ల మంది చందాదారుల్లో కనీసం సగం మందిని అయినా సొంతం చేసుకుని..తద్వారా 50 కోట్లమార్క్‌ను అధిగమించాలని, 64.6 కోట్ల చందాదారుల లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికలతో జియో సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వొడా–ఐడియా  మూసివేస్తే చందాదారుల పరంగా అటు ఎయిర్‌టెల్‌ కూడా కలసి  వస్తుంది. ప్రభుత్వరంగ BSNL ఇప్పటికీ 4G సేవల్లో లేదు కనుక ఆ సంస్థకు వెళ్లే చందాదారులు తక్కువగానే ఉంటారని అంచనా వేస్తున్నారు.

Read More>>కరోనా ఎఫెక్ట్ : అతిపెద్ద బ్యాంకులో 35వేల ఉద్యోగాలు కోత!