Home » దిమ్మ తిరిగిపోయే స్కెచ్ వేసిన కేసీఆర్ : KTR CM అవుతారని ప్రచారం
Published
10 months agoon
By
madhuతెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నదని అంటున్నారు. మరికొద్ది నెలల్లో సీఎం కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం కూర్చుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోందని అంటున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానిక జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ కవిత పోటీ చేయబోతున్నారు. కవిత అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ కావడం.. ఆ తర్వాత కొద్ది కాలానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితతో పాటు, కొద్ది మంది ముఖ్య నేతలను తన వద్దకు పిలిపించుకొని కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ నుంచి కవిత ఎంపికపై వారు సానుకూలత వ్యక్తం చేశారట. ఈ సందర్భంగా కేసీఆర్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతోనూ ఫోన్లో మాట్లాడారట. వారు కూడా అభ్యర్థిగా కవిత ఎంపికను స్వాగతించారని చెబుతున్నారు. ఆ తర్వాతే ఈ విషయం జిల్లాకు చెందిన పలువురు పార్టీ ముఖ్యుల చెవిన పడింది. ఇక ఆమె ఎమ్మెల్సీగా గెలవడమే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు తథ్యమని అంటున్నారు.
నిజానికి తొలుత కవితను పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారని పార్టీలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాలంలో కవిత ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే వస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా మారిన సమీకరణాలతో సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్రెడ్డికి పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. వారు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ దశలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరపున కవిత పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఉంటారని, సమయం చూసుకొని పార్టీ నేతలకు వెల్లడించారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్లో చేరిన డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అర్థాంతరంగా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుంది. అంటే కవిత ఇప్పుడు ఎన్నిక అయినా కూడా రెండేళ్ల పాటే ఈ పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది. ఆ తర్వాత మరో ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఆమెను ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దించుతారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈ లోపు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే… మంత్రి వర్గంలో కూడా ఆమెకు చోటు దక్కుతుందనే ప్రచారం మొదలైంది.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అరవింద్ తండ్రి డి. శ్రీనివాస్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడే అయినా, పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కవిత కూడా నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ లోక్సభ స్థానంపై టీఆర్ఎస్ పట్టు సడలుతోందనే అభిప్రాయం కేసీఆర్కు ఉంది. అందుకే ఎమ్మెల్సీ స్థానం పార్టీ అభ్యర్థిగా కవిత పేరు ఖరారు చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కవితను ఖాళీగా ఉంచితే, పార్టీ పరంగా ఇక్కడ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీగా ఆమెను రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించారట.
ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే కవిత మంత్రి కావడం ఖాయమనే ప్రచారం మొదలైంది. భవిష్యత్తులో కేటీఆర్ సీఎం బాధ్యతలు చేపడితే, ఆయన చేపట్టిన మంత్రిత్వ శాఖలు కవిత నిర్వహిస్తారని అంటున్నారు. అయితే ఇందుకు కొంత సమయం పట్టవచ్చని పార్టీ ముఖ్యులు కొందరు చెబుతున్నారు. కవిత ఎన్నిక కానున్న ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం జనవరి 4, 2022న ముగిశాక, మళ్లీ అదే స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుస్తారని వివరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందే కవితను మంత్రిగా చూడడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Read More : కరీంనగర్కు 100 వైద్య బృందాలు : ఆ 8 మంది ఎక్కడ తిరిగారు ? ఎవరిని కలిశారు ?