Home » రెండు సార్లు టీకా కంపల్సరీ, వదంతులు నమ్మొద్దు – మోదీ
Published
1 month agoon
Covid-19 Vaccination : ఒక్కసారి టీకా తీసుకున్నాక..మరిచిపోవద్దని, రెండోది కూడా ఖచ్చితంగా తీసుకోవాలని, ఎలాంటి వదంతులు, పుకార్లు నమ్మవద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. రెండు డోస్ లకు మధ్య నెల రోజుల వ్యవధి ఉంటుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 15 రోజుల తర్వాతే..కరోనాపై పోరాటం మొదలవుతుందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్కు దేశం సిద్ధమైంది. వ్యాక్సినేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
తొలి దశలో ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతటి మహాయజ్ఞం దేశంలో ఎప్పుడూ జరగలేదని, టీకా వేసుకున్నా..మాస్క్, భౌతిక దూరం పాటించాలని మరోసారి సూచించారాయన. మన పరిస్థితులకు అనుగుణంగానే..వ్యాక్సిన్ లు తయారయ్యాయని, ప్రాణాలు అడ్డపెట్టారు కాబట్టే..ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి టీకా ఇస్తున్నామన్నారు. నిస్వార్థ గుర్తింపుగానే వారియర్స్ కు మొదటి టీకాలు అన్నారు. చాలా తక్కువ టైమ్ లోనే వ్యాక్సిన్ తీసుకొచ్చామని మోదీ వెల్లడించారు.
తక్కువ సమయంలోనే రెండు మేడిన్ వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. దేశీయ వ్యాక్సిన్లతో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని చెప్పిన మోడీ..అంతా ఒకే సంకల్పంతో ఎలా పనిచేస్తారో భారత్ చూపించిందన్నారు. భారత్ లో కరోనా మరణాలు చాలా తక్కువ..కోలుకున్న వారు చాలా ఎక్కువన్నారు. చాలా జిల్లాల్లో కరోనా నుంచి కోలుకుని ఆనందంగా ఇళ్లకు వెళ్లారని తెలిపారు. కరోనాను ఎంత ధైర్యంతో ఎదుర్కొన్నామో…ఇప్పుడు కూడా అంతే ధైర్యంతో వ్యాక్సిన్ వేసుకోవాలని దేశ ప్రజలకు సూచించారు.
దేశవ్యాప్తంగా 3 వేల 6 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకాలు ఇవ్వనున్నారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను అధికారులు పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షణతో పాటు, ఈ ప్రక్రియ కోసం 1075 నెంబర్తో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది సందేహాలను అధికారులు నివృత్తి చేయనున్నారు.