సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన అనికా!

  • Published By: murthy ,Published On : September 2, 2020 / 10:59 AM IST
సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన అనికా!

మత్తు పదార్ధాల వాడకంతో శాండల్ ఉండ్ ఇప్పుడు కంపు కొడుతోంది.  గుట్టు చప్పుడు కాకుండా  స్మగ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్న శాండల్‌వుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్‌ డీలర్‌ అనికా, మత్తుపదార్దాలు నియంత్రణ దళానికి (NCB) వివరించినట్లు తెలిసింది.



డ్రగ్స్‌కు కోడ్‌ పేర్లను పెట్టి తాను సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తన నుంచి ఏయే నటీ నటులు డ్రగ్స్‌ను కొనేదీ వివరించారు. సుమారు 30 మంది వరకు సినిమా రంగానికి చెందిన వ్యక్తుల పేర్లను ఎన్‌సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించిన ఎన్‌సీబీ అధికారులు వారికి నోటీసులను ఇవ్వాలని నిర్ణయించారు.

తమిళనాడుకు చెందిన అనికా
నిందితురాలు పేరు అనికా…. అయితే అనికా డి, బిమని అనే రెండు మూడు పేర్లతో ఆమె బెంగళూరులో మత్తు పదార్ధాల దందాను నడపుతున్నట్లు విచారణలో తేలింది. సోషల్‌ మీడియాలో బిమని అనే పేరుతో చలామణి అయ్యేది. ఆమె తమిళనాడు సేలంకు చెందిన యువతి కాగా ఆమెకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు.



తమిళనాడులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును మధ్యలో వదిలేసింది. ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చింది. ఉద్యోగం దొరక్క, డ్రగ్స్‌ వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో తెలిపింది. ముంబై డ్రగ్స్‌ డీలర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి పెద్దమొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినప్పుడు సినిమా రంగ ప్రముఖుల బండారం బయటపడింది.

లంకేష్ సమాచారంతో మరి కొందరికి నోటీసులు
డ్రగ్స్‌ దందాపై సోమవారం దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఇచ్చిన సమాచారంతో సినిమా రంగానికి చెందిన మరో 15 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. సినీ రంగంలో డ్రగ్స్‌ తీసుకొనేవారి పేర్లను లంకేశ్‌ సీసీబీ పోలీసులకు అందజేశారు. బెంగళూరులో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై డ్రగ్స్‌ విషయంపై చర్చించారు. ఈ 15 మంది సినీ ప్రముఖులు ఎవరనేది ఇప్పుడు శాండల్‌వుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.



కరోనా కాలంలో నేరాల పెరుగుదల
డ్రగ్స్‌ వ్యవహారం అధికంగా నడుస్తున్న ఉప్పారపేట, బసవేశ్వరనగర, చంద్రా లేఔట్‌ ప్రాంతాల పోలీసుస్టేషన్లను నగరపోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంథ్‌ మంగళవారం తనిఖీ చేశారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కరోనా వచ్చిన తరువాత బెంగళూరు నగరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు ఆయన చెప్పారు.