పెళ్లి పేరుతో రూ.11.5 లక్షలు కాజేసి పరారైన ప్రియుడు

  • Published By: murthy ,Published On : November 16, 2020 / 07:20 PM IST
పెళ్లి పేరుతో రూ.11.5 లక్షలు కాజేసి పరారైన ప్రియుడు

Man cheats girlfriend on pretext of marriage : పెళ్లి చేసుకుందాం… ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ప్రియురాలినుంచి 11.5లక్షలు కాజేసి, సొంతూరుకు పరారైన ప్రియుడిపై బెంగుళూరులో కేసు నమోదైంది. బెంగుళూరు వైట్ పీల్డ్ లో నివిసించే యువతి(30) ఇంద్రానిల్ దత్తా(31) అనే వ్యక్తితో ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఆయువతిది పశ్చిమబెంగాల్ కాగా, ప్రియుడు ఇంద్రానిల్ దత్త బీహార్ కు చెందినవాడు. వీరిద్దరూ కాలేజీలో చదువుకునే రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. చదువు పూర్తయిన తర్వాత బెంగుళూరులో రెండు వేర్వేరు సంస్ధల్లో ఉద్యోగాల్లో చేరారు.

ఉద్యోగాల్లో స్ధిరపడిన తర్వాత పెళ్లి చేసుకుని సొంత ఇంటి కలను నిజం చేసుకోటానికి ఇద్దరూ కలిసి జాయింట్ ఎకౌంట్ లో బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు దాచుకోవటం మొదలెట్టారు. వీరి ప్రేమను ఇంద్రానిల్ తల్లితండ్రులు కూడా అంగీకరించారు. దీంతో ఆయువతి తన ఆదాయంలో కొంత మొత్తాన్ని ఉమ్మడి ఖాతాలో దాచుకోవటం ప్రారంభించింది.


కాగా ఆయువతికి తెలియకుండా ఇంద్రానిల్ క్రెడిట్ కార్డు తీసుకుని దాన్నితన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. అందుకు చెల్లింపులు ఉమ్మడి ఖాతా బ్యాంకు ఎకౌంట్ నుంచి చెల్లించాడు. ఈలోగా ఇంద్రానిల్ తల్లి,తండ్రులు కాబోయే కోడలిని ఆర్ధిక సాయం చేయమని కోరారు. అప్పుడు ఆమె ఉమ్మడి ఖాతానుంచి, తను దాచుకున్న ఇతర ఖాతాలనుంచి రూ. 11.5లక్షలు వారికి ఇచ్చింది.


డబ్బుతీసుకున్న తర్వాత నుంచి ఇంద్రానిల్ తన ప్రియురాలిని తప్పించుకు తిరగటం మొదలెట్టాడు. ఇంద్రానిల్ ను కలవటానికి ప్రయత్నించగా అతడు బీహార్ లోని కిషన్ గంజ్ లోని స్వగ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుసుకుంది. మోసపోయానని గ్రహించిన యువతి, ప్రియుడిపై వైట్ ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి మీద ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.