బ్రేకింగ్ : కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : October 14, 2020 / 08:51 AM IST
బ్రేకింగ్ : కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్య

keesara tahsildar:కోటి రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో నిందితుడిగి ఉన్న కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్‌ చేసారు.




ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు.

అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారింది అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.




కాగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్‌ 604 నుంచి 614 వరకు గల కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (గవర్నమెంట్‌ కస్టోడియన్‌ ల్యాండ్‌) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు సిధ్దమయ్యారు.

రియల్‌ ఎస్టేట్ బ్రోకర్‌ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్‌ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల భోగట్టా.